జాబిల్లిపై చంద్రయాన్-3 ముహూర్తం ఖరారు
- 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ - సాఫ్ట్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాబిల్లిపై చంద్రయాన్-3 కాలుమోపే చారిత్రక ఘట్టానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్ ల్యాండర్ అన్వేషిస్తోంది. ఈ క్రమంలో భూమికి ఎప్పుడూ కనిపించని చంద్రుడి దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతానికి సంబంధించిన కొన్ని చిత్రాలను ల్యాండర్ తన కెమెరాలో బంధించింది.ఈ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు చేసింది. విక్రమ్ ల్యాండర్కు అమర్చిన ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా చంద్రుడి అవతలివైపు ఫొటోలను తీసినట్లు తెలిపింది. జాబిల్లిపై విక్రమ్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు ఈ కెమెరా సాయపడుతుందని పేర్కొంది. బండరాళ్లు, లోతైన కందకాలు లేని సురక్షితమైన ప్రాంతాన్ని గుర్తించేందుకు విక్రమ్ ల్యాండర్ అన్వేషిస్తున్నట్లు వెల్లడించింది.తొలుత ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు సాఫ్ట్ల్యాండింగ్ చేయాలని ఇస్రో నిర్ణయించింది. అయితే తాజాగా ఈ సమయంలో మార్పు చేశారు. 17 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ను చంద్రుడిపై దించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇస్రోట్విట్టర్ ద్వారా నిన్న వెల్లడించింది. మరోవైపు చంద్రయాన్-3కి పోటీగా రష్యా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమవడంతో ఇప్పుడు అందరి కళ్లూ చంద్రయాన్-3పైనే ఉన్నాయి. చారిత్రక ఘట్టం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ కక్ష్య నుంచే ల్యాండింగ్
ప్రయోగంలో కీలకమైన రెండో డీబూస్టింగ్ ప్రక్రియ సైతం విజయవంతమైంది. ఆదివారం ల్యాండర్ వేగాన్ని తగ్గించే విన్యాసాన్ని ఇస్రో చేపట్టింది. ఈ ప్రక్రియ అనంతరం ల్యాండర్ జాబిల్లికి మరింత చేరువైంది. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ 25 x 134 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తున్నది. ఇదే కక్ష్య నుంచి ఈ నెల 23న సాఫ్ట్ ల్యాండింగ్ చేపట్టనున్నది.
సాఫ్ట్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం
అంతరిక్ష పరిశోధనల్లో దేశం సాధించిన పురోగతిని భారతీయులందరూ వీక్షించేలా ఇస్రో ప్రణాళికలు రచిస్తోంది. జాబిల్లిపై ల్యాండర్ కాలు మోపే అద్భుత దృశ్యాన్ని అందరూ చూసేలా లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. సాఫ్ట్ ల్యాండింగ్కు సంబంధించి సాయంత్రం 5.27 గంటల నుంచి లైవ్ను ప్రారంభించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆదివారం ఇస్రో వెల్లడించింది. ఇస్రో వెబ్సైట్, య్యూట్యూబ్ చానల్, ఫేస్బుక్ పేజీ, డీడీ నేషనల్ చానల్లో ఈ దృశ్యాలను వీక్షించవచ్చు. విద్యా సంస్థల్లో లైవ్స్ట్రీమింగ్ నిర్వహించాలని ఇస్రో పిలుపునిచ్చింది.