ఇండియా-భారత్ పేరు వివాదం పట్ల స్పందించిన చైనా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జీ20 (G20) సదస్సుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా ఇండియా-భారత్ పేరు వివాదం తెరపైకి రావడం పట్ల చైనా స్పందించింది. పేరు మార్పు కంటే కీలకమైన అంశాలపై భారత్ దృష్టి సారించాలని సూచించింది. జీ20 వేదిక అవకాశాన్ని భారత్ తన అంతర్జాతీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగించుకోవాలని పేర్కొంది.భారత్ తన ఆర్థిక వ్యవస్థను సమగ్రంగా సంస్కరించగలదా అనేదే ముఖ్యమని, విప్లవాత్మక సంస్కరణలు లేకుండా, భారతదేశం విప్లవాత్మక అభివృద్ధిని సాధించదని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది. జీ20 వేదిక ద్వారా భారత్ ప్రపంచ దేశాల దృష్టిని తన వైపు తిప్పుకునేలా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామని, ఇది దేశ వృద్ధిని ముందుకు నడిపించగలదని వ్యాఖ్యానించింది.రానున్న జీ20 సదస్సుపై ప్రపంచం దృష్టి కేంద్రీకరించిన క్రమంలో ప్రపంచానికి భారత్ ఏం చెప్పదలుచుకున్నదని చైనా ప్రశ్నించింది. పేరు మార్పు ప్రతిపాదన వలసవాద పేర్లను తొలగించే ప్రక్రియను ప్రతిబింబిస్తోందని చైనా మీడియా వ్యాఖ్యానించింది. జీ20 డిన్నర్కు ప్రతినిధులకు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసిఉండటంతో మోదీ సర్కార్ దేశం పేరును భారత్గా మార్చేస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రతిపాదనపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. విపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడంతోనే కాషాయ సర్కార్ దేశం పేరును భారత్గా మార్చాలని యోచిస్తోందని విరుచుకుపడ్డాయి.