ఇండియా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై స్పష్టత..

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా (I.N.D.I.A.) బ్లాక్ ఉమ్మడి మేనిఫెస్టో తో ప్రజల ముందుకు వెళ్తుందా? అనే ప్రశ్నకు ‘లేదనే’ మాట వినిపిస్తోంది. కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు సొంత మేనిఫెస్టోలు ఉంటాయని, అయితే ఉమ్మడి ఎజెండా మాత్రం ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, చర్చలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉన్నాయి.

సీట్ల షేరింగ్‌పై చర్చల్లో భాగంగా మంగళవారంనాడు న్యూఢిల్లీలోని ముకుల్ వాస్నిక్ నివాసంలో మహారాష్ట్రకు చెందిన ‘మహా వికాస్ కూటమి’ భాగస్వాముల మధ్య చర్చలు జరిగాయి. చర్చలు ఫలప్రదంగా జరిగినట్టు సమావేశానంతరం నేతలు తెలిపారు. సీట్ల షేరింగ్‌ కుదుర్చుకున్న తొలి రాష్ట్రం మహారాష్ట్రేనని నేతలు ప్రకటించారు. అయితే, మహా వికాస్ కూటమిలోని శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ, కాంగ్రెస్ మధ్య ఏ రేషియోలో సీట్ల పంపకాలకు అవగాహన కుదిరిందనేది అధికారికంగా నేతలు ఇంకా ప్రకటించలేదు. ఉద్ధవ్ థాకరే సారథ్యంలని శివసేన పెద్దన్న పాత్ర పోషించనుందని, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయనుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇండియా కూటమిలో కీలక పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం విజయమే లక్ష్యంగా భాగస్వామ్య పార్టీలతో చర్చలు సాగిస్తోంది. ఎన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేశామనే ధోరణిలో కాకుండా అత్యధిక సీట్లలో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అధిష్ఠానం వ్యూహరచన సాగిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.