100 స్థానాలను టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్.. ఆంధ్రప్రదేష్ లో సైతం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉపఎన్నిక ముగియడంతో బీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా తీర్చిదిద్దే ప్రయత్నాలను సీఎం కేసీఆర్ షురూ చేసినట్లు తెలుస్తోంది. హోరాహోరీగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలో కాషాయ పార్టీని ఓడించిన ఉత్సాహంతో జాతీయ స్థాయికి బీఆర్ఎస్‌ను బలంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తోన్నట్లు సమాచారం. గల్లీలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ పావులు కదుపుతోన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం జరుగుతోన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపే ఆలోచన గులాబీ బాస్ చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది నేతలతో కూడిన టీఆర్ఎస్ బృందాన్ని గుజరాత్‌కు కేసీఆర్ పంపించినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో పాటు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 100 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను పోటీలోకి దింపేందుకు ఇప్పటినుంచే కసరత్తులు చేస్తోన్నారట. ఇందుకు గాను తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలను కేసీఆర్ ఎంచుకున్నట్లు చెబుతున్నారు. మొత్తం 543 స్థానాల్లో పోటీ చేయడమంటే కష్టమైతరమైన పని. ఆర్ధిక వనరులకు చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే పెద్ద నియోజకవర్గాలు, బలమైన నేతలు ఉన్న స్థానాల్లో కాకుండా ఖర్చు తక్కువయ్యే చిన్న పార్లమెంట్ స్థానాలను బీఆర్ఎస్ ఎంచుకోనుందని గులాబీ నేతలు చెబుతున్నారు. డిసెంబర్ 7న బీఆర్ఎస్ పేరు అధికారికంగా ఖరారు అయిన తర్వాత ఏయే రాష్ట్రాల్లో బరిలోకి దిగుతామనే విషయంపై కేసీఆర్ క్లారిటీ ఇస్తారని టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ స్పష్టం చేశారు. అభ్యర్థుల ఖర్చు తక్కువగా ఉండే స్థానాల్లో స్థానికంగా బలంగా ఉన్న నేతలను ఎంపిక చేసి పోటీలోకి దింపే ఆలోచన చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయంతో పాటు మిగతా అన్ని విషయాలపై కూడా కేసీఆర్ త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశముందని తెలిపారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడంపై సీఎం కేసీఆర్ మంగళవారం పబ్లిక్ నోటీస్ జారీ చేశారు. పార్టీ మార్పుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలపాలని పత్రికల్లో యాడ్ ఇచ్చారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత బీఆర్ఎస్‌ పేరుకు ఈసీ అనుమతి ఇచ్చే అవకాశముంది. మునుగోడు ఉపఎన్నిక ముగిసిన తర్వాతి రోజే కేసీఆర్ పార్టీ మార్పుపై పబ్లిక్ నోటీస్ జారీ చేయడంతో.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఢిల్లీలో బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఈసీ నుంచి బీఆర్ఎస్‌కు అనుమతి వస్తే గుజరాత్ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశముందని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.