రాహుల్ జైలు పై సూరత్ సెషన్స్ కోర్టులో కాంగ్రెస్ సవాల్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పరువు నష్టం కేసులో రెండేళ్ళ జైలు శిక్ష పొందిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ తీర్పుపై అపీలు చేయబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. దోషిత్వ నిర్థరణ, శిక్ష విధింపుపై సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో సవాల్ చేయబోతున్నట్లు వెల్లడించింది. మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని, దోషిత్వ నిర్థరణ తీర్పును తాత్కాలికంగా నిలిపేయాలని కోరబోతున్నట్లు తెలిపింది. ఈ కోర్టు తీర్పుతో ఆయన తన లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, దొంగలందరికీ ఇంటి పేరు మోదీ ఎలా ఉంటోందని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీ దోషి అని తీర్పు చెప్పి, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించి, 30 రోజుల పాటు బెయిలు మంజూరు చేసింది. అనంతరం ఆయన లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడని పార్లమెంటు సచివాలయం ప్రకటించింది. అయితే ఈ కోర్టు తీర్పుపై అపీలు చేసుకునే అవకాశం రాహుల్ గాంధీకి ఉంది. ఇదిలావుండగా, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని పరిశీలిస్తున్నామని అమెరికా, జర్మనీ ప్రకటించడంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మన దేశ అంతర్గత వ్యవహారాల్లోకి విదేశీ జోక్యాన్ని కాంగ్రెస్ ఆహ్వానిస్తోందని మండిపడుతోంది.రాహుల్ గాంధీ దోషి అని మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానాలు నిలిపివేయకపోతే, ఎన్నికల కమిషన్ ఆయన ప్రాతినిధ్యం వహించిన కేరళలోని వయనాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించవలసి వస్తుంది. రానున్న ఎనిమిదేళ్లపాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు.కోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పార్లమెంటు సచివాలయం రద్దు చేయడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు తప్పుబడుతున్నాయి. చెల్లాచెదురుగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యేందుకు ఇదొక అవకాశంగా మారింది. అయితే ఇదంతా చట్టబద్ధంగానే జరిగిందని బీజేపీ వాదిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.