పీసీసీ కొత్త కమిటీలపై వివాదం.. బెల్లయ్యనాయక్ రాజీనామా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్లో కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలు కల్లోలం సృష్టిస్తున్నాయి. పీసీసీ కొత్త కమిటీలపై వివాదం రోజురోజుకు ముదురుతున్నది. అంకితభావంతో పార్టీకి సేవచేస్తున్నవారిని కాదని కొత్తగా చేరిన వారికి, జూనియర్లకు ప్రధాన కమిటీల్లో చోటు కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ కొత్తకమిటీలపై అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె బాటలోనే పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్ పయణించారు. తన పదవికి రాజీనామా చేశారు. తనకు కొత్త కమిటీల్లో చోటుకల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇప్పటికే కొండా సురేఖ తనకు స్థానం కల్పించిన ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు. ఎంతో రాజకీయ అనుభవం గల తనకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చోటు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కాకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీలో తనకు స్థానం కల్పించడమేంటని ప్రశ్నించారు. ఇది తనను అవమానించడమేనన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో తనకు స్థానం అవసరం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.