ఐటీ కంపెనీపై సైబర్ అటాక్

.. చేతివాటం ప్రదర్శించిన కంపెనీ ఉద్యోగులు

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : మూడో కంటికి తెలియకుండా మోసం చేయవచ్చనే క్రిమినల్స్ సైబర్ నేరాలను ఎంచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్‌కాల్స్‌, ఫేక్ యాప్స్‌తో జనం డబ్బులు కాజేస్తున్న వారిని సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. కాని హైదరాబాద్‌లో ఏకంగా ఒక పేరు మోసిన ఐటీ కంపెనీని కాజేయడానికి అందులో పని చేస్తున్న ఉద్యోగులే సైబర్ నేరగాళ్లుగా మారారు. సైబర్ క్రైమ్ పోలీసులకు సదరు కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు విచారించారు. ఈ సైబర్ దాడిలో అసలు సూత్రధారులు కంపెనీలో ఉద్యోగులుగా ఉన్న విజయ్‌కుమార్, కరణ్‌కుమార్‌, అశ్వంత్‌కుమార్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌ విశ్వనగరంగా మారుతున్న క్రమంలో సైబర్ నేరాలు కూడా అంతే విస్తృతంగా పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీగా పేరున్న హాంగర్ టెక్నాలజీ సంస్థపై సైబర్‌ దాడులు జరిగాయి. ఐటీ కంపెనీ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరా తీయడంతో షాకింగ్ సీక్రెట్స్ బయటపడ్డాయి. సైబర్ దాడికి పాల్పడింది హాంగర్‌ టెక్నాలజీ అనే ఐటీ కంపెనీలో గత కొంతకాలంగా పనిచేస్తున్న అందాగ్ విజయ్‌కుమార్, కరణ్‌కుమార్‌, అశ్వంత్‌కుమార్‌ అనే ముగ్గురితో పాటు మరొక వ్యక్తి ఈ నేరానికి పాల్పడినట్లుగా తేల్చారు. సైబర్ అటాక్ చేసి కంపెనీకి సంబందించిన కీలకమైన డేటాను కాజేసిన సైబర్ మోసగాళ్లలో విజయ్‌కుమార్, కరణ్‌కుమార్‌, అశ్వంత్‌కుమార్‌ అనే ముగ్గురితో పాటు మరో ఇద్దర్ని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరు ఉద్యోగులు కూడా నేరస్తులకు సహాకరించినట్లుగా తెలుస్తోంది. కొత్త తరహా సైబర్ క్రైం నేరానికి తెరతీసిన ఈ వ్యవహారంలో నిందితుల నుంచి ఒక తుపాకీ,10బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సైబర్ అటాక్‌లో మరో వ్యక్తి ఉన్నట్లుగా తేల్చారు. అతను అమెరికాలో ఉండటంతో త్వరలోనే పట్టుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.