ఎన్నికల ప్రయోజనం కోసమే దళిత బంధు: బయటపడిన కెసిఆర్ డొల్లతనం
- బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దళిత బంద్ పథకం పై మీడియా లో వచ్చిన వార్తలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. దళిత బందు కోసం బడ్జెట్లో మాత్రం రూ.17,700 కోట్లు కేటాయించి… గత 10 నెలల్లో రూపాయి కూడా తియ్యలేదని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి ఎదిగిన కేసీఆర్ సర్కారు సాధించిన ఘనతకు ఇది నిదర్శనమన్నారు. ‘‘తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి ఎదిగిన కేసీఆర్ గారి సర్కారు సాధించిన ఘనతకు నిదర్శనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన ఈ కథనం. దేశం మొత్తాన్ని ఉద్ధరించేస్తామంటూ డబ్బా కొట్టుకుంటున్న కేసీఆర్ గారు… కేవలం ఎన్నికల ప్రయోజనం కోసమే తెలంగాణలో ప్రవేశపెట్టిన దళిత బంధులోని డొల్లతనాన్ని మీడియా బట్టబయలు చేసింది. బడ్జెట్లో మాత్రం రూ.17,700 కోట్లు కేటాయించి… గత 10 నెలల్లో రూపాయి కూడా తియ్యలేదు. ఒక్కరికి కూడా ఈ పథకం అమలు కాలేదు. ఇది చాలక… బీఆరెస్కి పగ్గాలిస్తే దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తామంటూ దొంగ హామీలిస్తున్నరు. ఇదంతా దళితులను మభ్యపెట్టడం, మోసపుచ్చడం కాక ఇంకేమిటి? కేసీఆర్ సర్కారు ఊదరగొడుతున్న ఈ దళితబంధులు, రైతుబంధులు చివరికి బంద్ అవుతాయని నేను గతంలో పలుమార్లు చెబుతూనే వచ్చాను. చివరికి ఆదే జరుగుతోంది’’ అని విజయశాంతి పేర్కొన్నారు.