దెబ్బతిన్న చెరువులు, కాల్వల మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వర్షాల కారణంగా వనపర్తి జిల్లాలో దెబ్బతిన్న చెరువులు, కాల్వల మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సాగునీటి శాఖా సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎంజె 4 , ఖాన్ చెరువు, బుద్దారం రిజర్వాయర్, ఘణపురం రిజర్వాయర్ పనులకు వెంటనే టెండర్లు పిలవాలని తెలిపారు.అనంతపురం గ్రామానికి సాగునీళ్లు ఇచ్చేందుకు ఏదుల వీరాంజనేయ రిజర్వాయర్ నుంచి కొత్త కాలువ ఏర్పాటుకు కావాల్సిన భూసేకరణ, భూమి నష్టపరిహారానికి వెంటనే అంచనాలు తయారు చేసి ప్రభుత్వ అనుమతికి పంపించాలని సూచించారు. చీఫ్ ఇంజనీర్ కార్యాలయ నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని,పెద్దమందడి మండలంలో అవసరమైన చెరువుల మరమ్మతుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బలహీనంగా ఉన్న చెరువులు, కుంటలపై దృష్టిపెట్టాలని తెలిపారు.