అన్ని అంశాలను బేరీజు వేసుకునే కవిత అరెస్ట్‌పై నిర్ణయం

-   సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు లో పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందుకు విచారణకు హాజరుకాలేనని, అలాగే ఆరోగ్యం కూడా బాగోలేదని విచారణకు మరో తేదీని నిర్ణయించాలని కవిత తన న్యాయవాదుల ద్వారా ఈడీకి సమాచారం అందజేశారు. ఈ క్రమంలో ఈడీ అధికారుల ముందు ఉన్న మార్గాలు ఏంటి?… విచారణకు కవిత హాజరుకావాల్సిందేనా?.. లేక అరెస్ట్ చేసి విచారణ జరుపుతారా?.. అనే అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మీడియా తో మాట్లాడారు.ఈడీ ఇచ్చిన నోటీసుపై కవిత సమాధానం ఇచ్చారని అన్నారు. కవిత అంశంపై ఈడీ దగ్గర కొన్ని మార్గాలు ఉన్నాయన్నారు. ఈడీ మరో తేదీని ఇచ్చే అవకాశం ఉందని, లేదా సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందున అది ముగిసేవరకు వేచి చూసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కస్టడీలో ఉన్నవారి దగ్గరకు రమ్మని కవితకు సమన్లు జారీ చేసే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. కవిత తన సెల్‌ఫోన్లను నిర్వీర్యం చేశారని అంటున్నారని, ఆ ఫోన్లలో ఈడీ తమకు అవసరమైన అంశాలు ఉన్నాయని… దీనిని ప్రాధాన్యతగా భావించే అవకాశం ఉందని తెలిపారు. అన్ని అంశాలను బేరీజు వేసుకునే కవిత అరెస్ట్‌పై నిర్ణయం ఉంటుందని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.ఇలాంటి క్రిమినెల్ కేసులలో ప్రతీ విషయాన్ని కోర్టు ద్వారా పరిష్కారం అవ్వాలే తప్ప.. వ్యక్తిగత అభిప్రాయాలు చెల్లుబాటు కావని తెలిపారు. కోర్టు ద్వారానే పరిష్కారం పొందాలని సూచించారు. కవిత తన ప్రతినిధి సోమా భరత్ ద్వారా ఈడీకీ పంపిన సమాచారంలోని విషయాలు సుముఖంగా ఉంటే మరో తేదీ ఇచ్చే అవకాశం ఉందన్నారు. అరెస్ట్ చేసే అధికారం ఉంది కదా అని ప్రతీ కేసులో కూడా దర్యాప్తు సంస్థలు అరెస్ట్‌ లు చేయరన్నారు. ఈ కారణాల వల్ల అరెస్ట్ చేశామంటూ కోర్టు ముందు చెప్పాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థల ముందు ఉంటుందని జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.