దీక్షలతో దద్దరిల్లుతున్నఢిల్లీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో దీక్షకు దిగారు. ఉదయం 10.30 గంటలకు కవిత దీక్షను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో తెలంగాణ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌తో పాటు బీఆర్ఎస్ మహిళా ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భారత జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలు పాల్గొన్నాయి.

కవిత దీక్షకు 18 విపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ఆ పార్టీ ప్రతినిధులు దీక్షలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం కవిత నిరసన దీక్షలో కూర్చున్నారు. సీపీఏం నేత సీతారం ఏచూరి స్వయంగా దీక్షలో పాల్గొని మద్దతు ఇచ్చారు. మహిళల నిరసనల నేపథ్యంలో జంతర్‌మంతర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, 27 ఏళ్ల నుంచి బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు. 1996లో దేవెగౌడ హయాంలో బిల్లు పెట్టినా చట్టం కాలేదని, రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మహిళలను గౌరవించడం మన సాంప్రదాయమన్నారు. అటు సీతారం ఏచూరి మాట్లాడుతూ.. కవిత ఒక మంచి అడుగు వేశారని, మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టేంత వరకు పోరాటం చేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెడతామని గతంలో మోదీ హామీ ఇచ్చారని, కానీ తొమ్మిదేళ్లు అయినా బిల్లులను ప్రవేశపెట్టలేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరుకావాల్సిందిగా 8వ తేదీన ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. 9వ తేదీన ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే 10వ తేదీన నిరసన దీక్ష ఉన్న నేపథ్యంలో విచారణకు రావడం కుదరదని, మరో రోజు వస్తానంటూ ఈడీకి కవిత లేఖ రాశారు. 11న కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

Leave A Reply

Your email address will not be published.