దుర్గమ్మ దర్శనానికి బారులు తీరిన భక్తులు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా దుర్గమ్మ దర్శనం ఇస్తారు. అమ్మవారి మూల విరాట్‌ను వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని సైతం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇంద్రకీలాద్రిలో ఉపాలయాలకు కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు.. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబం ప్రసాదం ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు పంపిణీ చేయనున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.ప్రతి ఏడాది ఆషాడ మాసంలో శాకాంబరి దేవి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేశం సస్యశ్యామలంగా ఉండి పాడిపంటలతో అభివృద్ధి చెందేందుకు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. శాకాంబరీ దేవి గురించి దేవీ భాగవతంతో పాటుగా మార్కడేయ పురాణంలోని చండీసప్తశతిలో ప్రస్తావన ఉంది. శాకాంబరీ దేవి నీలవర్ణంలో కమలాసనంపై కూర్చుని.. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు ధరించి ఉంటుంది.జీవులకు కలిగే ఆకలి దప్పి, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవి పోగొడతాయి అంటారు. కాంతులను ప్రసరించే ధనుస్సును ధరించే పరమేశ్వరిని శాకాంబరీ, శతాక్షి, దుర్గ అనే పేర్లతో కీర్తింపబడుతుందని చెబుతున్నారు. ఈ దేవి శోకాలను దూరం చేసి, దుష్టులను శిక్షించి శాంతిని కలుగజేయడమే కాదు పాపాలను పోగొడుతుంది అని నమ్మకం. శాకాంబరీ దేవిని భక్తితో పూజించి, స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు.. అలాగే నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారని చెబుతుంటారు

Leave A Reply

Your email address will not be published.