సెప్టెంబర్ 2 నుంచి హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు  ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అని చెప్పారు. వచ్చే నెలలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో డబుల్‌బెడ్‌రూం ఇండ్లను పంపిణీ చేస్తామని తెలిపారు. మొత్తం 12 వేల మందికి రెండు పడక గదుల ఇండ్ల పట్టాలు అందిస్తామన్నారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో మంత్రి మహమూద్‌ అలీతో కలిసి డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మంత్రి తలసాని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, దళారులను నమ్మొద్దని సూచించారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని చెప్పారు. పేదల సొంతిల్లు కల నెరవేర్చడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు.సెప్టెంబర్‌ 2న కుత్బుల్లాపూర్‌లో ఇండ్ల పంపిణీని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే ప్రకటించారని చెప్పారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే దేశంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్‌ డ్రా తీస్తున్నామని తెలిపారు. ఎన్‌ఐసీ రూపొందించిన ర్యాండమ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా అర్హులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో మొదటి విడతలో భాగంగా 12 వేల మందికి ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రపు ఆర్థిక సహాయంతో ఇండ్లను నిర్మించాయని విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద మనసుతో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఉచితంగా నిర్మించి అందిస్తున్నారని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.