తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఓటర్లారా ప్రలోభాలకు లొంగ వద్దని ఓటర్లకు లోక్ సత్తా పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈరోజు సూర్యలోక్ కాంప్లెక్స్ లోని పి. ఇ. టి హాల్లో లోక్ సత్తా పార్టీ “మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి” పేరిట ప్రచురించిన కరపత్రాన్ని నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ చైర్మన్ వి.జి.ఆర్. నారగోని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజక వర్గానికి త్వరలో జరుగనున్న ఉపఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోబాలకు గురిచేస్తున్నారని, అధికార కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నేతలు, మంత్రులు, ఎం.ఎల్. ఏ లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుండటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయని అన్నారు. ఈ సమావేశానికి లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బు,మద్యం, బహుమతులు,పదవులు పంచే పార్టీలను, అభ్యర్థులను తిరస్కరించాలని ఆయన అన్నారు. ఎన్నికల జాతరలో అంగట్లో ఓట్లు అన్న చందంగా ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్న పార్టీల విపరీత వైఖరిని అందరూ ఖండించాలన్నారు. నియోజకవర్గ ఓటర్లు పార్టీలు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, ధైర్యంగా తమ ఓటును వినియోగంచుకోవాలని, మీ భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టవద్దని ఆయన ప్రతి ఓటరును కోరారు.డా. రాంనర్శయ్య, యం.సూర్యనారాయణ, నందిపేట రవీందర్, తీగలపల్లి రంగాచారి తదితరులు పాల్గొన్నారు.