భూమి, భుక్తి, విముక్తి పోరాట ఉద్యమానికి దొడ్డి కొమరయ్య స్పూర్తి

-  రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ సాయుధ పోరాటం భూమికోసం, భుక్తికోసం, విముక్తి పోరాట ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణమని, తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్ఫురణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమురయ్య అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో నే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఆలేరు పట్టణంలో దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహాన్ని ఏపీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షుడు ఎడ్ల మల్లేశంతో కలిసి మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో ఎంతో స్ఫూర్తిని చూపిస్తూ దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కురుమ కులస్తులైన రాములు సాంబశివుడు నమ్మిన ధర్మం కోసం చివరి వరకు పోరాటం చేశారని, ఏ కులంలో నైనా ఐక్యత, విద్య ఉండాలని మంత్రి అన్నారు. కురుమ కులస్తులు కూడా ఐక్యమత్యంగా ఉండి విద్యలో రాణించాలని తాను కోరుకుంటున్నానన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, కురుమ కులస్తులు పిల్లలను బాగా చదివించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో ఇంగ్లిష్‌ విద్యాబోధన అందిస్తున్నారని, ఎక్కడైనా చదివించవచ్చు కానీ చదివించడం మాత్రం ముఖ్యం అన్నారు.

బాల్యవివాహాలు నిర్మూలించేందుకు కల్యాణ లక్ష్మి పథకం ఉపయోగపడుతుందని, 18 ఏండ్లు నిండిన వారికి మాత్రం కల్యాణ లక్ష్మి వర్తిస్తుందని, దాంతో సమాజంలో బాల్య వివాహాలు చాలా వరకు తగ్గాయన్నారు. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో చేర్చిందని, కొమురవెల్లి మల్లన్న గుడికి ఒక కురుమను చైర్మన్ చేసిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్ర కురుమ సంఘం భవనం పూర్తికావొచ్చిందని, త్వరలోనే దాన్ని పూర్తి చేసి కురుమ కులస్తులకు అందివనున్నట్లు తెలిపారు. విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం గొప్పతనం కాదని, స్ఫూర్తిని కొనసాగించినప్పుడే ఆయనకి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.