హిందువులపై డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హిందువులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని కీలకమైన రాష్ట్రాల్లో హిందువులు అందించిన మద్దతుతోనే తాను అధ్యక్షుడిని కాగలిగానని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఫ్లోరిడాలో రిపబ్లికన్ హిందూ కూటమి (ఆర్హెచ్సీ) ఏర్పాటు చేసిన దీపావళి కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగించారు.ఈ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. 2024లో తనను మళ్లీ అధ్యక్షుడిగా గెలిపిస్తే భారత్తో సంబంధాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తానన్నారు. అంతేకాకుండా ఆర్హెచ్సీ వ్యవస్థాపకుడు శలభ్కుమార్ను భారత్లో అమెరికా రాయబారిగా నియమిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు.కాగా 2016లో అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసినప్పుడు డోనాల్డ్ ట్రంప్ న్యూజెర్సీలో భారీ సభను నిర్వహించారు. న్యూజెర్సీలో పెద్ద సంఖ్యలో భారతీయులు.. అందులోనూ హిందువులు ఎక్కువగా ఉన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన ట్రంప్ భారతీయులపై అభిమానాన్ని చాటుకున్నారు. హిందూ మతానికి తాను పెద్ద అభిమానినని తెలిపారు. అలాగే భారతదేశానికి కూడా పెద్ద అభిమానినని హాట్ కామెంట్స్ చేశారు.హిందువులు భారతీయ అమెరికన్ల తరాలు అమెరికాను బలోపేతం చేశాయని ట్రంప్ అన్నారు. మీ విలువలు కృషి విద్య అమెరికాను సుసంపన్నం చేశాయని కొనియాడారు.కాగా అమెరికాకు 2016 నుంచి 2020 వరకు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. రెండోసారి కూడా ఆయన 2020లో పోటీపడ్డారు. డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2024లో ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగడానికి ట్రంప్ సిద్ధమవుతున్నారు.కాగా దీపావళి సందర్భంగా అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ కూడా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భారతీయులు దీనికి హాజరై దీపావళి సంబరాల్లో పాలుపంచుకున్నారు. పవిత్రమైన విలువలకు దీపావళి చిహ్నమని బ్లింకెన్ కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.