ఎన్నికల వేళ పర్యావరణాన్ని బలిగొనవద్దు
రాజకీయ పార్టీలకు ఎన్విరాన్నెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ విజ్ఞప్తి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రత్యర్థికి మించి ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించాలనే ఉత్సాహంతో పర్యావరణ విధ్వంసక చర్యలకు పాల్పడవద్దని “ఎన్విరాన్నెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్” రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ శాసన సభ ఎన్నికల వేడి ముదురుతున్న వేళ ఓటర్లను ఆకట్టుకొనేందుకు, వారి వారి పార్టీల బలం నిరూపణ కోసం చేసే కార్ ర్యాలీ, బైక్ ర్యాలీ లాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాలనీ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య గురువారం బాగ్ లింగంపల్లి లో విలేకరుల సమావేశం ద్వారా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. అలాగే జన సమీకరణ, సభలు, సమావేశాల్లో “సింగిల్ యూజ్ ప్లాస్టిక్” వాడకుండా స్వయం నియంత్రణ పాటించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ కీలకమన్న విషయాన్ని గ్రహించి పార్టీలు, వాటి నేతలు వ్యక్తులకు, మానవ సమాజానికి స్ఫూర్తి దాయకంగా ఉండాలని సూచించారు. పార్టీల అధినేతలు ప్రత్యేక చొరవతీసుకొని కింది స్థాయి నాయకులకు, కార్యకర్తలకు పర్యావరణానికి నష్టం లేని విధంగా ఎన్నికల కార్యక్రమాలు నిర్వహించుకొనేలా ప్రత్యేకంగా పిలుపునివ్వాలని విజ్ఞప్తి చేశారు. అలా కాకుండా పర్యావరణానికి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం ఆయా పార్టీలపై ఎన్నికల సంఘానికి, న్యాయస్థానాలకు ఫిర్యాదు చేస్తామని కౌన్సిల్ అధ్యక్షులు హెచ్చరించారు.