తానా మహాసభలకు డాక్టర్ వకుళాభరణంకు ఆహ్వానం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమెరికా లోని ఫిలడెల్ఫియాలో జులై 7, 8, 9 తేదీలలో నిర్వహిస్తున్న తానా మహా సభలకు రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు కు ఆహ్వానం అందింది. ఈ సభలలో జరిగే ప్రధాన కార్యక్రమాల్లో డాక్టర్ వకుళాభరణం ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. కరోనా పరిణామాల అనంతరం ఈ సారి ప్రత్యక్షంగా జరుగబోయే ఈ మహా సభలను తానా ఘనంగా నిర్వహించనున్నది. కాగా అమెరికాలో నిర్వహించే తానా సభలలో కూడా డాక్టర్ కృష్ణమోహన్ ను ప్రత్యేకంగా సన్మానించనున్నారు. ఈ అమెరికా పర్యటనలో భాగంగా హూస్టన్, డల్లాస్, న్యూయార్క్, న్యూజెర్సీ, చార్లేట్ మున్నగు ప్రాంతాలలో జరిగే ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనాలు, అభినందన సభలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. జూలై  2 న, ఉదయం 4 గంటలకు బయలుదేరి వెళ్లనున్న డాక్టర్ వకుళాభరణం జూలై 24 వ తేది వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు వారాల పాటు అమెరికా లో పర్యటించడానికి  డాక్టర్ వకుళాభరణం కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 1న రవీంద్ర భారతిలో “తానా” నిర్వహించిన బహుజన ఉత్సవాలలో డాక్టర్ కృష్ణ మోహన్ కు “బహుజన బంధు పురస్కారం” ను అందజేసిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.