వోడ్కా తాగించి .. చేతులు కట్టేసి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దీప్తి హ‌త్య కేసు మిస్ట‌రీ వీడింది. ప్రియుడి స‌హ‌కారంతో చెల్లినే అక్క‌ను చంపిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ప్రేమ పెళ్లికి త‌ల్లిదండ్రులు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో.. ప్రియుడితో పారిపోయి వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న చెల్లి.. అక్క‌ను చంపి, బంగారం, న‌గ‌దుతో ఉడాయించింది. ఆర్మూర్ – బాల్కొండ రూట్‌లో నిందితులు కారులో వెళ్తున్నార‌ని పోలీసుల‌కు స‌మాచారం అందింది. ఆ మార్గంలోని జైవీర్ తేజ దాబా వ‌ద్ద నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.దీప్తి హ‌త్య కేసు వివ‌రాల‌ను జ‌గిత్యాల ఎస్పీ భాస్క‌ర్ మీడియాకు వెల్ల‌డించారు. కోరుట్ల‌కు చెందిన‌ బంక చంద‌న 2019లో హైదరాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు కాలేజీలో బీటెక్ జాయిన్ అయింది. ఉమ‌ర్ షేక్ సుల్తాన్‌(25) అనే యువ‌కుడు చంద‌న‌కు వ‌న్ ఇయ‌ర్ సీనియ‌ర్. చంద‌న రెండేండ్లు డిటెయిన్డ్ అయింది. ఉమ‌ర్ వ‌న్ ఇయ‌ర్ డిటెయిన్డ్ అయ్యాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు క్లాస్‌మేట్స్ అయ్యారు. ఈ క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింద‌ని ఎస్పీ పేర్కొన్నారు.

పెళ్లి చేసుకోవాల‌ని కోరిన చంద‌న‌..

అయితే త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని ఉమ‌ర్‌ను చంద‌న కోరింది. ఈ ఏడాది ఆగ‌స్టు 19వ తేదీన ఉమ‌ర్‌ను చంద‌న కోరుట్ల‌కు పిలిపించింది. పెళ్లి చేసుకోవాల‌ని అత‌న్ని కోరింది. ఇద్ద‌రం కూడా లైఫ్‌లో సెటిల్ కాలేద‌ని, త‌ర్వాత పెళ్లి చేసుకుందామ‌ని చంద‌న‌కు ఉమ‌ర్ చెప్పాడు. ఇదే విష‌యాన్ని వాట్సాప్ కాల్ ద్వారా ఉమ‌ర్ త‌ల్లి స‌య్య‌ద్ అలియా, చెల్లి ఫాతిమా, స్నేహితుడు హాఫీజ్‌తో చంద‌న మాట్లాడ‌టం జ‌రిగింద‌ని ఎస్పీ తెలిపారు.

మ్యారేజ్ ప్లాన్‌లో భాగంగా.. అక్కకు వోడ్కా తాగించి చంపేసింది..

ఇక చంద‌న మ్యారేజ్ కోసం ప్లాన్ చేస్తోంది. ఆగ‌స్టు 28న కాల్ చేసి ఓ ఫంక్ష‌న్ నిమిత్తం మా పేరెంట్స్ హైద‌రాబాద్ వెళ్తున్నారు. ఇంట్లో నేను, మా అక్క‌నే ఉంటాం. ఇంట్లో మ‌నీ, బంగారం ఉంది. అది తీసుకొని పోయి పెళ్లి చేసుకుంటే.. సెటిల‌వుతామ‌ని ఉమ‌ర్‌కు చంద‌న చెప్పింది. ఆగ‌స్టు 28న ఉద‌యం హైద‌రాబాద్ నుంచి కారులో బ‌య‌ల్దేరి 11 గంట‌ల‌కు కోరుట్ల‌కు ఉమ‌ర్ చేరుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా వోడ్కా, బ్రీజ‌ర్ తెప్పించింది చంద‌న‌. రాత్రి స‌మ‌యంలో దీప్తి, చంద‌న క‌లిసి వోడ్కా, బ్రీజ‌ర్ తాగారు. రాత్రి 2 గంట‌ల స‌మ‌యంలో ఉమ‌ర్‌కు మేసేజ్ చేయ‌డంతో ఇంటి వెనుకాల కారు ఆపి ఇంట్లోకి వ‌చ్చాడు. అనంత‌రం ఇంట్లో ఉన్న బంగారం, న‌గ‌దు తీస్తున్న స‌మ‌యంలో దీప్తికి మెల‌కువ వ‌చ్చి లేచింది. గ‌ట్టిగా అరిచింది. చంద‌న త‌న వ‌ద్ద స్కార్ఫ్‌తో దీప్తి మూతికి, ముక్కుకు చుట్టింది. ఆమె సోఫా మీద ప‌డిపోయింది. ఉమ‌ర్, చంద‌న క‌లిసి ఆమె చేతులు క‌ట్టేశారు. గ‌ట్టిగా అర‌వ‌కుండా మూతికి ప్లాస్ట‌ర్ వేశారు. ప‌ది నిమిషాల త‌ర్వాత దీప్తిలో చ‌ల‌నం లేకుండా పోయిందని పేర్కొన్నారు.

70 తులాల బంగారంరూ. ల‌క్షా 20 వేలతో ప‌రార్..

అక్క అచేత‌న స్థితిలో ఉండిపోవ‌డంతో.. ఇంట్లో ఉన్న ఒక ల‌క్షా 20 వేల న‌గ‌దు, 70 తులాల బంగారం బ్యాగులో వేసుకున్నారు. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు దీప్తికి ప్లాస్ట‌ర్ తీసేసి వెళ్లారు. వోడ్కా తాగి చ‌నిపోయిన‌ట్లు సీన్ క్రియేట్ చేశారు. తెల్ల‌వారుజామున 5 గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరారు. ఉమ‌ర్ త‌ల్లి, చెల్లి, బంధువుకు జ‌రిగిన విష‌యం చెప్పి.. న‌గ‌దు, బంగారంతో.. ముంబై, నాగ్‌పూర్ వెళ్లాల‌ని చంద‌న‌, ఉమ‌ర్ ప్లాన్ చేసుకున్నారు. అక్క‌డే పెళ్లి చేసుకుని, సెటిల్ అవ్వాల‌ని అనుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1 చంద‌న‌, ఏ2 ఉమ‌ర్, ఏ3 స‌య్య‌ద్ అలియా, ఏ4 ఫాతిమా, ఏ5 హాఫీజ్‌గా చేర్చామ‌ని తెలిపారు. ఈ ఐదుగురిని కోర్టులో హాజ‌రు ప‌రిచి రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు ఎస్పీ భాస్క‌ర్ తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.