టీచర్ పోస్టుల భర్తకి డిసెంబర్ లో డీఎస్సీ పరీక్ష
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షను డిసెంబర్లో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం డిసెంబర్ రెండో వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. గతంలో మాదిరిగా పరీక్షలను ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవలే గురుకుల పరీక్షలను సైతం సీబీటీ పద్ధతిలో విజయవంతంగా జరిపింది. డీఎస్సీని సైతం సీబీటీ పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీఎస్ ఆన్లైన్ యంత్రాంగంతో సమన్వయం చేసుకొని పరీక్ష తేదీలను ఖరారుచేసే పనిలో అధికారులు ఉన్నారు.అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్య ఆధారంగా షిఫ్టులవారీగా పరీక్షలను నిర్వహిస్తారు. ఎక్కువ షిఫ్టులు అవసరమైతే.. పరీక్షలు ముగిసిన తర్వాత నార్మలైజేషన్ చేస్తారు. దాదాపుగా హైదరాబాద్ చుట్టుపక్కలే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. జిల్లా కేంద్రాల్లోనూ పరీక్షలను కేటాయించేలా చర్యలు చేపడుతున్నారు. ఇక ప్రశ్నపత్రాల రూపకల్పన బాధ్యతలను రాష్ట్ర విద్యాశాఖ శిక్షణ పరిశోధనా సంస్థ (ఎస్సీఈఆర్టీకి) అప్పగిస్తారు. ఎస్జీటీలకు ఒక రోజు, స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టులకు రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇప్పటికే 6,612 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు, షెడ్యూల్తో కూడిన జీవో రెండు, మూడు రోజుల్లో విడుదల కానున్నది. ఆ వెంటే పాఠశాల విద్యాశాఖ అధికారులు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.