మునుగోడు రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై సీఈసీ వేటు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై సీఈసీ వేటు వేసింది. మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్సింగ్కు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు అప్పగిస్తూ ఎన్నికల కమిషన్ గుర్తుల కేటాయింపు అవకతవకలపై ఆర్వో జగన్నాథరావుపై వేటు వేశారు. నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో.. ఆర్వో వివరణ తీసుకొని నివేదిక పంపాలని సీఈవోకు ఆదేశాలిచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్రులకు గుర్తుల కేటాయింపులో గందరగోళంపై ఫిర్యాదులు రావడంతో ఎన్నికల కమిషన్ స్పందించింది. రోడ్డు రోలర్ గుర్తును మొదట పొందిన అభ్యర్థికి తిరిగి కేటాయించాలని బుధవారం మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. చంచల్గూడలో బ్యాలెట్ ప్రింటింగ్కు నల్లగొండ జిల్లా అధికారులు వెళ్లగా ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని, రోడ్డు రోలర్ గుర్తును జతచేసి కొత్తగా ప్రింట్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ చరిత్రలోనే ఈ పరిణామం ఒక కేస్ స్టడీగా మిగలనుందని సీఈవో కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. గుర్తు వివాదం నేపథ్యంలో మనుగోడు రిటర్నింగ్ అధికారిని ఆ విధుల నుంచి పక్కకు పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరో అధికారి కోసం ఏర్పాట్లు చేసుకోవాలని సీఈవో కార్యాలయం నుంచి నల్లగొండ జిల్లా అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. రోడ్డు రోలర్ వివాదం ఏంటి?నామినేషన్ల ఉపసంహరణ రోజే బరిలో మిగిలిన అభ్యర్థుల గుర్తుల పట్టికను రిటర్నింగ్ అధికారి ప్రకటించాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రులకు మూడు చొప్పున ఆప్షన్లు ఇస్తారు. ఒకే గుర్తు కోసం ఎక్కువ మంది ఆప్షన్ ఇస్తే డ్రా తీసి కేటాయిస్తారు. అయితే మునుగోడులో ఈ విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. డ్రా తీసి రోడ్డు రోలర్ గుర్తును యుగతులసీ రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థి శివకుమార్కు కేటాయించారు. అదే రోజు రాత్రి రోడ్డు రోలర్ గుర్తును తొలగించాలని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చండూరులోని రిటర్నింగ్ అధికారి, నల్లగొండలోని కలెక్టర్ బంగ్లా ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులు నామినేషన్ల ఉపసంహరణ రోజే ఎంత రాత్రి అయినా గుర్తులు ఫైనల్ చేసి అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సి ఉండగా వాయిదా వేశారు. 17న నామినేషన్ల ఉపసంహరణ ముగియగా 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గుర్తుల జాబితా వెల్లడించారు. అందులో రోడ్డు రోలర్ గుర్తు మాయమైంది.