తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: స్మార్ట్ ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్ వినియోగదారులను మరోసారి గందరగోళానికి గురి చేసింది. గతంలో మాదిరిగానే దేశవ్యాప్తంగా ఇవాళ చాలా మంది మొబైల్ యూజర్లకు ఓ ఎమర్జెన్సీ అలర్ట్ సందేశం వచ్చింది. ‘తీవ్ర పరిస్థితి’ అన్న అర్థంతో ఆ ఫ్లాష్ మెసేజ్ ఉంది. ఈ మెసేజ్తోపాటు పెద్దగా బీప్ సౌండ్ కూడా రావడంతో అంతా ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో..? ఎందుకు వచ్చిందో..? ఎవరు పంపారో..? తెలియక అంతా గందరగోళానికి గురయ్యాయి. అయితే, ఈ మెసేజెస్తో భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వమే పంపిందట. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగా ఈ మెసేజ్ వచ్చినట్లు తెలిసింది.రాబోయే ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్లలో కొత్త ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ను పరీక్షిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో చాలా మంది యూజర్లపై సిస్టమ్ పనితీరును టెస్ట్ చేయడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే యూజర్లకు సెక్యూరిటీ మెసేజ్ అలర్ట్ పంపుతోంది. విపత్తుల గురించి ప్రజలను హెచ్చరించేందుకు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు ఇప్పటికే ఇలాంటి వ్యవస్థను అమల్లోకి తెచ్చాయి. ఇప్పుడు భారత్ కూడా అలాంటి వ్యవస్థనే అమల్లోకి తెచ్చేప్రయత్నం చేస్తోంది.భూకంపాలు, ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు, సునామీలు, ఇతర విపత్తులేమైనా వచ్చినప్పుడు ప్రజలను తక్షణమే అలర్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగానే భారత ప్రభుత్వానికి చెందిన టెలికమ్యూనికేషణ్ విభాగంలోని సెల్ బ్రాడ్కాస్టింగ్ మొబైల్ యూజర్లకు టెస్ట్ మెసేజెస్ పంపుతోంది. ‘ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు’ అంటూ ఎమర్జెన్సీ అలర్ట్ ద్వారా సందేశం పంపుతోంది.