సంక్రాంతి పండగను అందరూ ఆనందంగా జరుపుకోవాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పండగను అందరూ ఆనందంగా జరుపుకోవాలి. కానీ పండగ సందర్భంగా ఎగురవేసే.. పతంగుల వల్ల పర్యావరణం, పక్షులకు హాని జరగకుండా చూడాలని అటవీ శాఖ కోరింది. పతంగులతో పాటు పక్షులనూ ఎగరనిద్దాం అనే నినాదంతో పండగ జరుపుకోవాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. నైలాన్, సింథటిక్ మాంజా (చైనీస్ మాంజా) వాడకం వల్ల అనర్థాలపై అందరూ అవగాహన కలిగిఉండాలని అటవీ శాఖ కోరింది. పతంగులను ఎగుర వేసేందుకు ఉపయోగించే చైనీస్ మాంజా (చైనా దారం) వల్ల తీవ్ర అనర్థాలు జరుగుతున్నాయని అటవీ శాఖ తెలిపింది. కేంద్ర పర్యావరణ చట్ట ప్రకారం చైనీస్ మాంజా వాడకాన్ని నిషేధించినట్లు అటవీ శాఖ తెలిపింది. (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు – 2016 ప్రకారం).  కైట్స్ ఎగరవేసేందుకు గ్లాస్ కోటింగ్ తో ఉన్న నైలాన్ , సింథటిక్ తాడును కొందరు వాడుతున్నారు. పండగ తర్వాత ఎక్కడికక్కడ ఈ వ్యర్థాలు మిగిలిపోయి పర్యావరణం, పక్షులకు హాని జరుగుతోంది. దారంలో చిక్కుకున్న పక్షులు విలవిల్లాడి, చనిపోతున్నాయి. మనుషులు కూడా గాయపడుతున్నారు. చైనీస్ మాంజా బదులు సంప్రదాయ కాటన్ దారాలను పతంగుల కోసం వాడాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ సూచించారు. సంక్రాంతి పండగ సీజన్ లో దేశవ్యాప్తంగా జరిగే సంఘటనల్లో చైనీస్ మాంజా బారినపడి మరణాలు నమోదవుతున్న విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం లో కూడా చైనా మాంజా వినియోగాన్ని నిషేధించామని పీసీసీఎఫ్ వెల్లడించారు. పోలీసులతో పాటు ఇతర శాఖలతో సమన్వయంతో మాంజా వాడకాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.చైనీస్ మాంజా అనర్థాలపై ప్రచారం చేయటంతో పాటు, ఎన్‌జీవోల సహకారంతో స్కూలు పిల్లలతో పాటు అందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. చైనా మాంజా అమ్మినా, నిలువ, రవాణా చేసినా ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా ఉందని, మాంజా వాడకం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరిగితే 3 నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష రూ. 10 వేల జరిమానా ఉంటుందన్నారు. గత కొన్నేళ్లుగా 28 లక్షల రూపాయల విలువైన 1391 కిలోల దాకా చైనీస్ మాంజా సీజ్ చేశామని అధికారులు తెలిపారు. చైనా దారం దిగుమతి వల్ల స్థానికంగా కాటన్ తో పంతుగుల దారం తయారు చేసేవాళ్లు ఉపాధి కూడా కోల్పోతున్నారు.చైనా మాంజా రవాణా చేస్తే వాహనాలు కూడా సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. పండగ సీజన్ లో నిఘా కోసం ప్రత్యేకంగా ఐదు టీమ్ లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చైనా దారం అమ్మకం గురించిన వివరాలు తెలిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్లు 040 – 23231440, 1800 4255 364 తెలియజేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.