స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు పలువురు గాయపడటం విచారకరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలించాలని.. అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రులు మహమూద్‌ అలీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు సూచించారు.

ఏం జరిగిందంటే..

సికింద్రాబాద్‌లోని రద్దీ ప్రాంతంలో ఉన్న స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి వేళ 7, 8 అంతస్థుల్లో తొలుత మంటలు చెలరేగాయి. ఆ తర్వాత 5, 6 అంతస్థులకు మంటలు వ్యాపించాయి. ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేసే పనిలోకి దిగారు. మంటలు అంటుకున్న ఫ్లోర్లలో ప్రైవేట్‌ కార్యాలయాలు, దుస్తుల గోదాములు ఉన్నాయి. అక్కడ పనిచేసే సిబ్బంది ఇండ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. కొందరు హాహాకారాలు చేస్తూ ప్రాణాలతో బయటపడగా, పలువురు మంటల్లో చిక్కుకున్నారు. మంటల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నదని భావించిన అధికారులు సమీప నివాసాల్లో ఉన్న వారిని సైతం ఖాళీ చేయించారు.

Leave A Reply

Your email address will not be published.