మోడీని చంపాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అరెస్ట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/మధ్యప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపాలంటూ మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి రాజా పట్రియా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత రాజా పట్రియా గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే నరేంద్ర మోడీని చంపాలంటూ రాజా పట్రియా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజా పట్రియా చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ గా మారడంతో బీజేపీ నేతలు ఆయనపై భగ్గుమన్నారు.మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లా పొవై తహసీల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి రాజా పట్రియా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ… మతం కులం భాష ప్రాతిపదికన ప్రజలను విభజిస్తున్నారని రాజా పట్రియా ధ్వజమెత్తారు.ప్రధాని మోదీ వ్యవహార శైలితో దళితులు గిరిజనులు మైనారిటీల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని రాజా పట్రియా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో బీజేపీ నేతలు ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రాజా పట్రియాను వెంటనే అరెస్టు చేయాలని పలువురు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేయాలని మధ్య ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఇది క్షమించరాని నేరమని కేంద్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్ర చేస్తున్నట్లు నటిస్తున్న వారి అసలు రూపం ఇదని మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పరోక్షంగా రాహుల్ గాంధీపై మండిపడ్డారు.ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదో ప్రజలకు తెలిసేలా చేశాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. దేశ ప్రజలు మోడీనో ఎంతో అభిమానిస్తున్నారని తెలిపారు. ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని అన్నారు.ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని చంపాలంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజా పట్రియాను డిసెంబర్ 13న పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.