వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. 2.25 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను నవంబరు 10న ఆన్‌లైన్‌లో విడుదల చేశామన్నారు. తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాల్లో 94 కౌంటర్ల ద్వారా డిసెంబరు 22 నుంచి మొత్తం 4,23,500 టోకెన్లు మంజూరు చేస్తామని వివరించారు. దర్శనటోకెన్లు(Darsan Tokens) ఉన్న భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామన్నారు.

 

ఆర్జిత సేవలు రద్దు..

 

డిసెంబరు 22 నుంచి 24వ తేదీ వరకు, డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేస్తున్నామని, ఈ సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని వివరించారు.

 

భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు

 

2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతితోపాటు చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో అందుబాటులో ఉన్నాయని ఈవో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.