నగరంలో నకిలీ క్యాన్సర్ మందుల గుట్టు రట్టు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: నగరంలో కేన్సర్ నకిలీ మందులు చలామణిలో ఉన్నట్లు తెలియడంతో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడి చేయడంతో గుట్టు రట్టయింది. మూడేళ్ల క్రితం మూతపడిన ఓ కంపెనీ నకిలీ మందులు తయారు చేసి కొరియర్ ద్వారా సరఫరా చేస్తోంది. రూ. 4.35 కోట్ల విలువ చేసే నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. కేన్సర్ వచ్చిందంటే సగం ప్రాణం పోయినట్లే. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకు ముప్పు. మూడు, నాలుగో స్టేజ్లో గుర్తిస్తే మరింత ఇబ్బందికర పరిస్థితులు. ఇంతటి ప్రాణాంతక కేన్సర్ మందులూ విక్రయిస్తుండడంతో అవి వాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.మందులు వాడినప్పటికీ కేన్సర్ తగ్గకపోవడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్లు రాశారు కదా అని మార్కెట్లో విక్రయిస్తున్నవి కొనుగోలు చేస్తున్నారు. అవి ఏ మందులో తెలియక ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఔషధాల్లో వాడాల్సిన పదార్థాలకు బదులుగా ఇతర పదార్థాలు వాడడం, వాడాల్సిన స్థాయిలో పదార్థాలను ఉపయోగించకుండా సాధారణ పదార్థాలను వినియోగిస్తున్నారు. చాక్పీస్ సుద్ద, గ్లూకోజ్ పౌడర్, చక్కెర నీళ్లు వంటి వాటిని కలిపి నకిలీ మందులు తయారు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు నకిలీ, నాసిరకం మందులు తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తుండడంతో ప్రజలు నష్టపోవాల్సి వస్తోందని వైద్యులు తెలిపారు.