చారిత్రక మెదక్ చర్చిలో కన్నుల పండువగా క్రిస్మస్ వేడుకలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/మెదక్: చారిత్రక మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉదయం 4.30 గంటలకు మొదటి ఆరాధన నిర్వహించారు. ఏసు క్రీస్తు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా శిలువను ఊరేగింపుగా తీపుకొచ్చి చర్చిలోని ప్రధాన వేదికపై ప్రతిష్ఠించారు. బిషప్‌ రెవరెండ్‌ ఏసీ సాలోమన్‌రాజ్‌ భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం 9.30 గంటలకు రెండో ఆరాధనలో చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జి రెవరెండ్‌ జార్జి ఎబినైజర్‌ రాజు భక్తులకు సందేశం చేయనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాస్టర్లు భక్తులకు దీవెనలు అందజేస్తారు. ఇందుకోసం సికింద్రాబాద్‌ నుంచి పాస్టర్లు వచ్చారు. రాత్రి 9 గంటల వరకు చర్చి తెరిచే ఉంటుంది. క్రిస్మస్‌ వేడుకలకు మెదక్‌ డయాసిస్‌ పరిధిలోని పాత ఉమ్మడి జిల్లాలైన మెదక్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన క్రైస్తవ సోదరులు పెద్దఎత్తున తరలివచ్చారు.పూర్తిగా రాతితో నిర్మించిన చర్చి మెయిన్ టవర్, కమాన్‌లను, చర్చి ప్రాంగణాన్ని, చర్చిలో బిషప్, గురువులు కూర్చునే ప్రధాన వేదికను అందంగా అలంకరించారు. భారీ సైజు క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. క్రీస్తు వృత్తాంతాన్ని భక్తుల కళ్లకు కట్టేలా పశువుల పాకను ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.