ప్రమాదంలోచనిపోయిన లేదా వికలాంగత్వం పొందిన వారికి ఆర్ధిక సహాయం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గుర్తు తెలియని వాహనం డీకొట్టడం ద్వారా ప్రమాదంలో చనిపోయిన లేదా వికలాంగత్వం పొందిన వారికి ఆర్ధిక సహాయం అందించడంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్ లో హిట్ అండ్ రన్ ( మోటార్ ప్రమాదాల పధకం-2022) పై సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గుర్తు తెలియని వాహనం డీకొట్టడం ద్వారా ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్ 1, 2022 నుంచి మోటార్ ప్రమాదాల పధకం-2022 క్రింద జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ద్వారా నష్టపరిహారం అందించాలని నిర్ణయించిందని అన్నారు. ఈ పధకం క్రింద చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల ఆర్ధిక సహాయం, గాయపడిన వారికి తక్షణ వైద్య చికిత్స నిమితం 50 వేల ఆర్ధిక సహాయం అందించనుందని అన్నారు. అందులో భాగంగా బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీలు ప్రతి మూడు మాసాలకొకసారి సమావేశమై అప్పటి వరకు జరిగిన ప్రమాదాలపై పూర్తి నివేదికలను పరిశీలించి ఆమోదం అనంతరం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించవలసి ఉంటుందని, ఆ మేరకు జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నేరుగా లబ్ధిదారుని ఖాతాకు డబ్బులు పంపుతుందని అన్నారు. జిల్లలో ఇప్పటి వరకు 17 ప్రమాద కేసులు నమోదు కాగా 15 కేసులపై ఎఫ్.ఐ.ఆర్., పోస్ట్ మార్టం నివేదిక తో పాటు సంబంధిత తహసీల్ధార్లు ఎవరికీ క్లెయిమ్ అందించాలో వివరాలు కమిటీకి అందించారని, మిగిలిన రేండు కేసులపై త్వరితగతిన విచారణ జరిపి నివేదికలు అందించాలని రమేష్ తెలిపారు.