వెనిజులాను ముంచెత్తిన వరదలు

.. 22 మంది మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

దక్షిణ అమెరికాలోని వెనిజులాను వరదలు ముంచెత్తాయి. లాస్ టెజెరియాస్ నగరంలో కొండచరియలు విరిగిపడి పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించాయి. కొండచరియలు కారణంగా 22 మంది మరణించగా.. దాదాపు 50 మంది గల్లంతయ్యారు. వందలాది ఇండ్లు కూలిపోయాయి. అధ్యక్షుడు నికోలస్ మదురో మూడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. భారీ వర్షం తర్వాత కొండచరియలు విరిగిపడటం వల్లనే విధ్వంసం జరిగిందని నికోలస్‌ విచారం వ్యక్తం చేశారు. ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నది.
30 ఏండ్ల అనంతరం లాస్ టెజేరియాస్‌లోని అతిపెద్ద నది నీటి మట్టం అమాంతం పెరగడం వల్ల వరదలు సంభవించాయని ఓ అధికారి తెలిపారు. అంతకుముందు 1999 లో వర్గాస్ నగరంలో కొండచరియలు విరిగిపడి 10,000 మంది మరణించారు. విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత లాస్ టెజేరియాస్‌ నగారంలో పెద్ద సంఖ్యలో రెస్క్యూ టీమ్లను మోహరించారు. బొలివేరియన్ జాతీయ సాయుధ దళాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి.
కేవలం 8 గంటల్లోనే ఒక నెలలో కురిసిన వర్షం కురవడం వల్లనే ఈ ఉత్పాతం సంభవించిందని వెనిజులా వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ విచారం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా నగరం శివారులోని ఐదు చిన్న నదులు పొంగిపొర్లుతున్నాయి. గల్లంతైన తమ వారి కోసం అక్కడి వారు రెస్క్యూ బృందాలతో వెతుకుతున్నారు. బాధితుల కోసం ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఆహారం, నివాసం ఏర్పాట్లు చేసింది. విద్యుత్ స్తంభాలు వరదలో కొట్టుకుపోవడంతో విద్యుత్‌ సరఫరా లేక చిమ్మ చీకట్లోనే ప్రజలు మగ్గుతున్నారు. తాగేందుకు నీరు లేక చాలా మంది అలమటిస్తున్నారు. వ్యాధులు చుట్టుముట్టే అవకాశాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో వైద్యుబృందాలను మోహరించారు.

Leave A Reply

Your email address will not be published.