మాజీ ప్రజా ప్రతినిధుల కోసం ‘పంచాయతీరాజ్ గ్రూప్’ ఏర్పాటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధుల కోసం ‘పంచాయతీరాజ్ గ్రూప్’ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మంత్రుల నివాసంలో క్యాంప్‌ కార్యాలయంలో స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు వినోద్‌కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ లోక్‌సభ, రాజ్యసభల్లో సిట్టింగ్, మాజీ ఎంపీల కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ గ్రూప్ ఉంటుందని, ఈ గ్రూప్ ద్వారా ఉభయ పార్లమెంటరీ సభల్లో జరిగే ముఖ్య ఘటనల సమాచారం, కేంద్ర ప్రభుత్వం జారీ చేసే వివిధ అంశాల ఉత్తర్వులు సభ్యుల సమాచారం కోసం ఈ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తుంటారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే రాష్ట్రంలోని స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులకు కూడా పంచాయతీరాజ్ గ్రూప్ ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. గ్రామ సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యులుగా, జడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించి రిజర్వేషన్ రోష్టర్ వల్ల గానీ, ఎన్నికల్లో ఓటమి చెందడం వల్ల గానీ, తిరిగి పోటీ చేయలేక పోవడం వంటి పలు కారణాల మాజీలుగా ఉంటున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను పార్టీలకు అతీతంగా ఒకే వేదికగా ఉంచే విధంగా పంచాయతీ రాజ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని వినోద్ కుమార్ వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే వివిధ అంశాల ఉత్తర్వులు, స్థానిక సంస్థల సమగ్ర సమాచారాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు అందించేందుకు పంచాయతీ రాజ్ గ్రూప్ ఎంతో ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర సమాచారాన్ని గ్రామస్తులకు చేరవేసేందుకు పంచాయతీ రాజ్ గ్రూప్ ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ తెలిపారు. ఇందు కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దాని ద్వారా మాజీ ప్రజాతినిధులు పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉ ంటుందన్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి శంకర్, ప్రధాన కార్యదర్శి సాయిబాబా, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ధరావత్ పూల రాణి, సంఘం రాష్ట్ర నాయకులు అంజయ్య, సుంకన్న, అప్పా రావు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.