మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుతూహలమ్మ బుధవారం ఉదయం తిరుపతి నగరంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1949 జూన్ 1న ప్రకాశం జిల్లా కందుకూరులో జన్మించారు. ఎంబీబీఎస్ చేసి డాక్టర్గా సేవలందించారు. గుమ్మడి కుతూహలమ్మ 1979లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేశారు. 1980 – 85 మధ్య చిత్తూరు జడ్పీ చైర్పర్సన్ గా విధులు నిర్వహించారు. 1985లో వేపంజేరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.1991 – 93 మధ్యలో ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గా కుతూహలమ్మ పనిచేశారు. 1999 – 2003 మధ్య అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యురాలి గా సేవలందించారు. 2007 – 2009 మధ్య అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కుతూహలమ్మ సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ లో కీలక బాధ్యతలు నిర్వహించిన కుతూహలమ్మ 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. కుతూహలమ్మ మృతి పట్ల టీడీపీ, కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సంతాపం ప్రకటించారు.