భారత్ వచ్చేవిదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇతర దేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కోవిడ్ కట్టడి కోసం తీసుకొచ్చిన ఎయిర్ సువిధ‘ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధనను రద్దు చేసింది.  కరోనా కేసులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం (నవంబర్ 22) నుంచే దీనిని అమల్లోకి తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే.. ఎయిర్ సువిధ‘ నిబంధనను ఎత్తివేసినప్పటికీ కొన్ని నిబంధనలను ప్రయాణికులు కచ్చితంగా పాటించాలని కోరింది.ముఖ్యంగా ప్రయాణ సమయంలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వాళ్లు మాస్కు ధరించాలని కోరింది. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు మిగతా ప్రయాణికులకు దూరంగా ఉండాలని సూచించింది. ఇలాంటి వారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఐసోలేషన్లో ఉండాలని పేర్కొంది.
విదేశాల నుంచి వచ్చినవారు తమ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరిశీలించుకుంటూ తమలో ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించినా హెల్ప్లైన్ను సంప్రదించి వివరాలు అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.ఇప్పటివరకు కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. వారి వ్యక్తిగత వివరాలతో పాటు ఏ వ్యాక్సిన్ ఎన్ని డోసులు ఏ సమయంలో తిసుకున్నారనే వివరాలను అందించాల్సి ఉందనే విషయం తెలిసిందే.అదేవిధంగా ఇప్పటివరకు ఆర్టీపీసీఆర్ టెస్టు వివరాలను కూడా ఎయిర్ సువిధ‘ పోర్టల్లోని సెల్ఫ్ డిక్లరేషన్ పత్రంలో పొందుపరచాల్సి వచ్చేది. తాజాగా ఈ నిబంధనను కూడా భారత్ తీసేసింది.అయితే ఈ నిబంధనలు తీసివేసినప్పటికీ పూర్తిస్థాయిలో కోవిడ్ టీకా తీసుకున్న తర్వాతే భారత్కు రావడం మంచిదని వెల్లడించింది. బోర్డింగ్ సమయంలోనూ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి అని.. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్కు వెళ్లాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.కాగా అధికారిక లెక్కల ప్రకారం భారత్లో నవంబర్ 21 నాటికి క్రియాశీలక కేసులు 6402 ఉన్నాయి. ఇక జాతీయ రికవరీ రేటు 98.8 శాతానికి పెరిగింది.

Leave A Reply

Your email address will not be published.