గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ మృతి
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కర్నాటక బిజెపి నేత, మాజీ ఎమ్మెల్సీ ఎం.బి.భానుప్రకాష్ గుండెపోటుతో మరణించారు. శనివారం కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ పై 29.84 శాతం, డీజిల్ పై 18.44 శాతం అమ్మకం పన్ను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.3, డీజిల్ రూ.3.05 చొప్పున పెరిగింది. పెంచిన ధరలపై బిజెపి సోమవారం రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టింది. అయితే ఈ నిరసనల్లో పాల్గొన్న కర్నాటక బిజెపి నేత, మాజీ ఎమ్మెల్సీ ఎం.బి.భానుప్రకాష్ గుండెపోటుతో మరణించారు. శివమొగ్గలో బిజెపి చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కారులో ఆయనను ఎక్కిస్తుండగా కుప్పకూలిపోయారు. సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.