వచ్చే జనవరి నుంచి పెన్షన్ను రూ. 3వేలకు పెంచుతాం

-  ఏపీ అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వచ్చే జనవరి నుంచి రూ. 3వేలకు పెన్షన్ పెంచుతామని కీలక ప్రకటన చేశారు. పెంపు తర్వాతే ఎన్నికలకు వెళ్తానని జగన్ తేల్చిచెప్పారు. గవర్నర్ ప్రసంగంకు సమాధానం ఇస్తూ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ ఏం చేసింది..? ఏం చేయబోతోంది..? అనే విషయాలను నిశితంగా వివరించారు. గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి మాత్రమే.. అది కూడా కేవలం రూ. 1000 పెన్షన్ అందేదని.. తమ హయాంలో 65 లక్షల మందికి రూ. 2750 చొప్పున అందిస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా జగన్ చెప్పుకొచ్చారు. ఏపీలో మాదిరిగా పెన్షన్, రేషన్ అందిస్తున్న విధానం ప్రపంచంలోనే ఎక్కడా లేదని సీఎం స్పష్టం చేశారు. అంతేకాదు.. రేషన్ కార్డులు కోటి 46 లక్షలకు పెంచామని.. ప్రజలకు రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నామని తెలిపారు.

మా ప్రభుత్వం చేసింది ఇదీ..!

ఎన్నికల హామీలను మరిచిపోవడం గత ప్రభుత్వానికి అలవాటేనని విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 80 శాతం నెరవేర్చామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 45 నెలల్లో 98 శాతం హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం వైసీపీ అని అసెంబ్లీలో ఆయన చెప్పుకొచ్చారు. 45 పాలనలో మార్పు వచ్చిందని.. జగన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి దానిని అమలు చేయటంలో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయతను పెంచి గొప్ప మార్పును తీసుకువచ్చాం. కులమత రాజకీయాలు , వర్గాలు చూడ కుండా సంక్షేమ పథకాలు అందించాం. నాలుగో ఏడాది వరుసగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. అందరూ నా వాళ్లే అన్న నిర్ణయంతో పాలన అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు అభివృద్ధి పథంలోకి వెళ్లేలా పాలన జరుగుతోంది. 1.97 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా బటన్ నొక్కి బదిలీ చేశాం. గతంలో బడ్జెట్‌లు ఎవరికీ అర్ధం కాని రీతిలో ఉండేవి, ప్రజలకు ఏం మేలు జరిగిందన్న సమాధానం దొరికేది కాదు. ఇప్పుడు ఇంటింటికీ, మనిషి మనిషికి, గడపగడపకూ వివరాలు అందించగలుగుతున్నాం. పాలన వికంద్రీకరించి 26 జిల్లాలు చేశాం, పౌరసేవలూ సులభంగా అందుతున్నాయి. 76 రెవెన్యూ డివిజన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయగలిగాం. 15004 గ్రామవార్డు సచివాలయాల ద్వారా 600 పౌరసేవలు ప్రజలకు అందించగలుగుతున్నాం’ అని జగన్ చెప్పుకొచ్చారు.

గొప్ప విప్లవం..!

ప్రభుత్వం అందించే పౌరసేవల్లో ఈ నిర్ణయం గొప్ప విప్లవం. ఏపీలో కొత్తగా వైద్య కళాశాలలు నిర్మిస్తున్నాం. వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం 2.49 రూపాయల యూనిట్ చొప్పున 7 వేల మెగావాట్లు విద్యుత్ అందిస్తున్నాం. విశాఖ సమ్మిట్‌తో పాటు దావోస్‌లో చేసుకున్న ఒప్పందాల మేరకు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం ఏపీ ఒక్కటే. సుపరిపాలన కారణంగానే ఇదంతా సాధించగలిగాం. గ్రామం నుంచి రాష్ట్ర రాజధాని వరకూ 45 నెలలో జగన్ మార్కు మార్పు కనిపిస్తుంది’ అని జగన్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.