ప్రజా పార్టీ” పేరుతో గద్దర్ కొత్త పార్టీ ..గద్దర్ కీలక నిర్ణయం..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గద్దర్ ప్రజా పార్టీ” పేరుతో గద్దర్ కొత్త పార్టీ పెడుతున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఈసీ అధికారులను కలిసి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నారు. గద్దర్ విప్లవానికి పోరాటానికి ప్రతీక. అందువల్లే “గద్దర్ ప్రజా పార్టీ” జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే జెండా మధ్యలో పిడికిలిని పెట్టారని సమాచారం. ఈ మూడు రంగుల్లో ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగులతో రూపొందించారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గద్దర్ తన ప్రయాణాన్ని ఎరుపురంగుతో ప్రారంభించారు. గద్దర్ మొదటగా అంబేద్కరిస్టు.. కాలానుగుణంగా ఆయన వామపక్ష రాజకీయాలపై ఆకర్షితులయ్యారు. అందుకే నీలి రంగు కూడా జెండాలో తప్పకుండా ఉంటుందని భావిస్తున్నారు.గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో గద్దర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆ మధ్య వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కూడా. స్వరాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, నిరుద్యోగ సమస్య, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల తీరు, ధరణి పోర్టల్‌ వల్ల ప్రజలు పడుతున్న బాధలను.. ‘నన్ను గన్న తల్లుల్లారా’ అనే బాణిలో వివరిస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బట్టబయలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గద్దర్.. సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఆయన కాంగ్రెస్‌ చేరి ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. పోరు బాటకు పొద్దు పొడుపు. నిద్రాణమైన తెలంగాణకు మేలుకొలుపు. బానిసలారా లెండిరా అంటూ బహుజనులను జాగృతం చేసినా.. అమ్మా తెలంగాణమా అని ప్రజల గోసను గానం చేసినా.. పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి ఉద్యమాన్ని రగిలించినా.. అది గద్దర్‌కే సొంతం. గద్దర్‌ పాట విని ఎగిరి దుంకని పల్లె లేదంటే అతిశయోక్తి కాదు. పాటతోనే ప్రస్థానాన్ని ప్రారంభించి.. పాటతోనే ప్రజా ప్రస్థానాన్ని ముగిస్తానని చెప్పిన గద్దర్ అని పిలువబడే విఠల్ రావు ఇప్పుడు కొత్త పార్టీకి అంకురార్పణ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన విధివిధాలను ఆయన రూపొందుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ పేరు, జెండాను ఆయన రూపొందించారు కూడా.

 

Leave A Reply

Your email address will not be published.