ఓట్ల కోసం పూటకోమాట మాట్లాడే జూటాగాళ్లు వస్తున్నారు
.. ఆ బట్టెబాజ్ గాళ్లకు ఓటర్లు బుద్ది చెప్పాలి: మంత్రి హరీశ్రావు పిలుపు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడులో ఓట్ల కోసం పూటకోమాట మాట్లాడే జూటాగాళ్లు వస్తున్నరని, ఆ బట్టెబాజ్, జూటేబాజ్ గాళ్లకు ఓటర్లు బుద్ది చెప్పాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.ధర్మం వైపు నిలబడే జాతి గొల్ల కురమ జాతి అని రాష్ట్ర మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నాడు న్యాయం, ధర్మం పాండవుల వైపు ఉన్నందునే శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టాడని చెప్పారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా సీఎం కేసీఆర్ గొల్ల కురమలను అభివృద్ధి చేశారని, వారిని ఆర్థికంగా నిలబెట్టారని మంత్రి తెలిపారు. గొల్ల కురమలలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకంటే ఎక్కువ తెలివి తేటలు ఉంటాయని గతంలో అసెంబ్లీలో సీఎం చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.మన్నెగూడలో జరిగిన యాదవ-కురమ సభలో మాట్లాడిన మంత్రి.. గొల్ల కురమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రె పిల్లలు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వంలో, చట్టసభల్లో గొల్ల కురమలకు భాగస్వామ్యం కల్పించారన్నారు. కర్ణాటకలో అప్పటి మంత్రి, కాంగ్రెస్ నాయకుడు రేవణ్ణ గొర్రెల స్కీమ్ గురించి తెలిసుకుని సీఎం కేసీఆర్ను అభినందించారని, హైదరాబాద్కు వచ్చి గొంగడి కప్పి, గొర్రెపిల్లను ఇచ్చి సన్మానించాడని హరీశ్రావు గుర్తుచేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ నోటీసులు ఇచ్చినా రేవణ్ణ భయపడలేదని చెప్పారు.కురమలకు, యాదవులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మాణమవుతున్నాయని, రెండు మూడు నెలల్లో ప్రారంభమవుతాయని మంత్రి చెప్పారు. హుజూరాబాద్ లో దళితబంధు పథకం పెడితే ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని, అయినా ఇప్పటివరకు తాము 24 వేల కుటుంబాలకు దళిత బంధు అమలు చేశామని ఆయన తెలిపారు. గొల్ల కురమలు గొర్రెలు కొనుక్కోవడానికి ప్రభుత్వం డబ్బులు వేయిస్తే.. ఆ డబ్బులు చేతికి రావని, సీజ్ అవుతయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయన్నారు. కానీ, వచ్చే నెల ఐదో తేదీ తర్వాత ఎప్పటిలాగే మీకు నచ్చిన చోట గొర్రెలు కొనుక్కునే అవకాశం కల్పిస్తమన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపీ జనం కోసం చేసిందేమీ లేదన్నారు మంత్రి హరీశ్రావు. రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1200 వందలకు పెంచిందన్నారు. రైతులకు బాయిలకాడ, బోర్లకాడ మీటర్లు పెట్టేందుకు అంగీకరిస్తే రాష్ట్రానికి ఏడాదికి ఆరు వేల కోట్ల లెక్కన ఐదేళ్లకు 30 వేల కోట్లు ఇస్తమని కేంద్రం చెప్పిందని మంత్రి తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ తన ప్రాణం పోయినా మీటర్లు పెట్టనిచ్చేది లేదని తెగేసి చెప్పిండ్రని చెప్పారు.