నమ్మిన సిద్ధాంతాల కోసం జీవిస్తున్న ఏకైక ప్రింటింగ్ ప్రెస్ గీతా ప్రెస్
.. ప్రధాని నరేంద్ర మోడీ
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రపంచంలోనే కేవలం ఒక సంస్థగానే కాకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం జీవిస్తున్న ఏకైక ప్రింటింగ్ ప్రెస్ ‘గీతా ప్రెస్‘ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గీతా ప్రెస్ అనేది ప్రింటింగ్ ప్రెస్ మాత్రమే కాదని, కోట్లాది మంది ప్రజలకు దేవాలయమని కొనియాడారు. ప్రెస్ పేరులో గీత ఉందని, గీత కోసమే పనిచేస్తోందని అభినందించారు. గీతాప్రెస్ శతాబ్ది ఉత్సావాల ముగింపు సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గొరఖ్పూర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని శుక్రవారంనాడు పాల్గొన్నారు. గీతా ప్రెస్ నేపాలీ భాషలో అనువదించిన శివపురాణం, మహాశివపురాణం పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రధానమంత్రి సారథ్యంలోని జ్యూరీ ఇటీవల 2021 సంవత్సరానికి గాను గీతాప్రెస్కు గాంధీ శాంతి బహుమతిని ప్రకటించింది. ఈ బహుమతి కింద కోటి రూపాయల నగదు, మెమెంటో ప్రదానం ఉంటుంది. అయితే, విరాళాలు తీసుకోవడం తమ సంప్రదాయం కాదని, తదనుగుణంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని తాము అంగీకరించడం గీతాప్రెస్ సున్నితంగా నిరాకరించింది.కాగా, ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తన నియోజకవర్గమైన వారణాసిలోనూ పలు కార్యక్రమాల్లో శుక్రవారం పాల్గొంటునున్నారు. గోరఖ్పూర్ ర్వైలే స్టేషన్ నుంచి గోరఖ్పూర్-లక్నో, జోధ్పూర్-అహ్మదాబాద్ వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. రూ.498 కోట్ల వ్యయంతో గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ రీడవలప్మెంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.