తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ శుభవార్త తెలిపింది. ఇంటర్మీడియట్ లేట్ ఫీజును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీతో దాదాపు తెలంగాణలో దాదాపు లక్షన్నర మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. నిజానికి ఇంటర్మీడియట్ పరీక్షల ఆలస్య రుసుము రూ. వెయ్యిగా ఉంది. కానీ అధికారులు దీనిని రూ. వందకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇంతకీ రెండున్నర లక్షల మంది విద్యార్థులు ఫీజులు ఆలస్యంగా చెల్లించడానికి అసలు కారణం ఏంటంటే. రాష్ట్రంలో 346 కళాశాలకు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ నుంచి మినహాయింపు ఇవ్వడంలో జరిగిన జాప్యంతో విద్యార్థులు లేట్ ఫీజు చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఎంపీ అసదుద్దీన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను కోరినట్లు సమాచారం. దీంతో ఈ విషయంపై స్పందించిన మంత్రి సబిత కూడా ఫీజును తగ్గించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ క్రమంలోనే సదరు కళాశాలల్లోని విద్యార్థులకు పరీక్షల ఆలస్య ఫీజును రూ.వెయ్యి నుంచి రూ.వందకు తగ్గిస్తున్నట్లు కార్యదర్శి నవీన్మిత్తల్ శుక్రవారం ఓ ప్రకటన జారీ చేశారు. విద్యార్థులు ఈ నెల 7, 8 తేదీల్లో పరీక్ష ఫీజులు చెల్లించాలి. మిగిలిన కళాశాలల్లోని విద్యార్థులు గతంలో ప్రకటించిన మేరకే పరీక్ష ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.