జూన్ 11న యధావిధిగా గ్రూప్-1 ప్రిలిమ్స్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 11వ తేదీన టీఎస్పీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలన్న పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో గతేడాది అక్టోబర్ 16వ తేదీన నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. నాడు గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులకు మరోసారి ఈ నెల 11వ తేదీన పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షకు సంబంధించి టీఎస్పీఎస్సీ హాల్ టికెట్లు కూడా విడుదల చేసింది.జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. కాగా, 503 గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3,80,202 దరఖాస్తు లొచ్చాయి.