ఆ సీటుపై హామీ.. మళ్లీ బీఆర్ఎస్ లోకి తుమ్మల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి పార్టీ మారడానికి తుమ్మల ప్రయత్నిస్తున్నారన్న వాదనలకు తెరపడింది.అభివృద్ధి పనుల ప్రారంభం కోసం సీఎం కేసీఆర్ ఖమ్మం వచ్చిన వేళ అసమ్మతికి తెరదించారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ భవనాన్ని పార్టీ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు.   అయితే ఆర్థిక మంత్రి టి హరీష్రావును ఆయన నివాసంలో కలిసిన ఒక రోజు తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఎం కేసీఆర్ సమావేశానికి రావడంతో అసమ్మతికి చెక్ పడింది.. ఈ సమావేశానికి మంత్రులు పువ్వాడ అజయ్కుమార్ వేముల ప్రశాంత్రెడ్డి ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యారు.బీజేపీలోకి చేరిపోతాడని భావించిన తుమ్మల సడెన్ గా ఎందుకు మారారు? ఎందుకు ట్రాక్ చేంజ్ చేశాడన్నది ప్రశ్న. రాబోయే ఎన్నికల్లో టికెట్ పై హామీ లేక ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో చేరడంతో ఇక దక్కదని బీజేపీలో చేరుదామని తుమ్మల భావించాడు. అయితే తాజాగా కేసీఆర్ ఎంట్రీ ఇచ్చి ఈ సీటు విషయంలో హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.తనకు గౌరవం లేని చోట ఉండనని ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆయన దారిలోనే తుమ్మల నాగేశ్వరరావు కూడా వరుస మీటింగులు పెట్టి అనుచరులతో సమాలోచనలు జరిపారు.అయితే కేసీఆర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఖమ్మం వచ్చిన మంత్రి హరీష్ రావు స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్లి భోజనం చేశారు. ఏకాంతంగా మాట్లాడారు. అనంతరం కేసీఆర్ కూడా తుమ్మలను వెంటబెట్టుకొని తిరిగారు. సీటుపై హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో కొంతకాలంగా బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న తుమ్మల మళ్లీ పార్టీలైన్ లోకి వచ్చినట్టేనని చర్చ సాగుతోంది.పాలేరు నుంచి పోటీ చేసేందుకు షర్మిల చాలా సుముఖంగా ఉండటంతో 2023లో ఈ నియోజకవర్గం విచిత్రమైన టఫ్ ఫైట్కు సాక్షిగా మారనుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కందాల ఉపేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్లో చేరారు.  తుమ్మల కంటే కేసీఆర్ కందాలకే ప్రాధాన్యత ఇవ్వవచ్చని వార్తలు వచ్చాయి.అయితే తుమ్మలకు పెద్దపీట వేయడంతో ఇప్పుడు పాలేరు టికెట్ ఈయనకేనని అర్థమవుతోంది.

Leave A Reply

Your email address will not be published.