తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హరియాణాలోని నుహ్లో వీహెచ్పీ ప్రదర్శన సందర్భంగా చెలరేగిన మత ఘర్షణలకు సంబంధించి పోలీసులు 116 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలపై మంగళవారం ఏకంగా 41 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. హరియాణ అల్లర్లలో ఇమాం సహా ఇద్దరు హోంగార్డులు, ఇద్దరు పౌరులు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.మరోవైపు గురుగ్రాంలో మంగళవారం రాత్రి అల్లర్లు చెలరేగడంతో ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) అప్రమత్తమైంది. గురుగ్రాంలోని సోహ్న సబ్డివిజన్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్ధలకు బుధవారం సెలవు ప్రకటించారు. అలజడి నెలకొనకుండా భారీ సంఖ్యలో ఆయా ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు.నుహ్ ఘర్షణలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద నిరసనలకు వీహెచ్పీ పిలుపు ఇవ్వడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. హరియాణ హింసాకాండకు వ్యతిరేకంగా మనేసర్లోని బిసం దాస్ మందిర్లో బుధవారం సాయంత్రం మహాపంచాయత్కు వీహెచ్పీ, భజరంగ్ దళ్ పిలుపు ఇచ్చాయి. నోయిడాలో భారీ ప్రదర్శన చేపట్టేందుకు హిందూ సంస్ధలు సన్నద్ధమయ్యాయి, నోయిడా స్టేడియం నుంచి ప్రారంభమయ్యే నిరసన ప్రదర్శన రజనిగంధ చౌక్ వద్ద ముగుస్తుందని వీహెచ్పీ ప్రచార కమిటీ చీఫ్ రాహుల్ దూబే వెల్లడించారు.