అమ్మాయిలను వేధిస్తే వీపులు పగులుతాయి
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: సోషల్ మీడియా వేదికగా మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న పోకిరీలపై తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్లోని షీటీమ్స్ రంగంలోకి దిగాయి. ఇందుకోసం వినూత్నంగా ఫొటోలు, మీమ్స్, షార్ట్ఫిల్మ్లు, సందేశాత్మక వీడియోల ద్వారా సోషల్ మీడియానే ఉపయోగించుకొంటున్నది.ఆడపిల్లలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా, తిట్టినా, వారి ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసినా, సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసినా, మిత్రులకు షేర్ చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించి.. ఎలాంటి కఠిన శిక్షలు వేస్తున్నారో సవివరంగా పోస్టుల ద్వారా షీటీమ్స్ అవగాహన కల్పిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా సందేశాత్మక వీడియోలు, షార్ట్ఫిల్మ్లు రూపొందిస్తున్నది. వీటితో పాటుగా ఆయా కాలేజీల్లో, స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
టెక్నికల్ సిబ్బందికి శిక్షణ
సోషల్ మీడియాలో మహిళలపై చోటుచేసుకుంటున్న వేధింపులను సమర్థవంతంగా అడ్డుకట్ట వేసేందుకు షీటీమ్స్ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనిట్లలో ఉన్న షీటీమ్స్ సిబ్బందికి దఫాలుగా పలు అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. పోకిరీ చేష్టలను ఉపేక్షించకుండా తక్షణమే కేసులు నమోదు చేసి, తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి.. కటకటాలకు పంపేలా ప్రణాళికలు తయారుచేసింది. వీటితోపాటు సైబర్ స్టాకింగ్, సైబర్ బుల్లింగ్, బ్లాక్మెయిలింగ్ వంటి తదితర అంశాలను సీరియస్గా తీసుకొని సోషల్ మీడియాలో పేట్రేగిపోతున్న పోకిరీల ఆటకట్టించేందుకు, అరెస్టు చేసేందుకు షీటీమ్స్ రంగం సిద్ధం చేసింది.