జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో హరీశ్రావు భేటీ
ఓటుకు నోటు కేసు దొంగ చేతిలో కాంగ్రెస్ పార్టీ బందీ: మంత్రి హరీశ్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఓటుకు నోటు కేసు దొంగ చేతిలో కాంగ్రెస్ పార్టీ బందీ అయిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో మంత్రి హరీశ్రావు భేటీ అయ్యారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన పార్టీలో చేరడానికి ఓకే చెప్పారు. అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడారు.కాంగ్రెస్ కొన్ని ముఠాల చేతిలోకి వెళ్లిందని విష్ణు బాధపడ్డారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. తెలంగాణ ఉద్యమంతో ఆయనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. తెలంగాణ కోసం నిలబడ్డ ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్లో చేరేందుకు అంగీకరించారని, ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. విష్ణు, తాను అసెంబ్లీలో కలిసి పనిచేశామన్నారు. తెలంగాణ హక్కుల కోసం దివంగత పీజేఆర్ పనిచేశారని చెప్పారు. ఆయన కార్మిక, పేదల నాయకుడని పేర్కొన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే కాంగ్రెస్ అన్నట్లుగా ఉండేదని తెలిపారు. సీఎల్పీ పదవికి పీజేఆర్ వన్నె తెచ్చారని వెల్లడించారు.కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి వస్తదని ఎప్పుడూ అనుకోలేదని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లో గాంధీ భవన్ను అమ్మే పరిస్థితి ఉందని విమర్శించారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతామన్నారు.రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు టికెట్ల కేటాయింపు వ్యవహారంపై కాంగ్రెస్లో చిచ్చు రేపింది. గత కొన్నేండ్లుగా పార్టీకోసం పనిచేస్తున్నప్పటికీ టికెట్లు దక్కకపోవడంతో పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ బీఆర్ఎస్లో చేరారు. సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. గత రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన విషయం తెలిసిందే.