తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో.తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు..
కాగా.. జగిత్యాల, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగాం, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక బుధవారం కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో రాగల 48 గంటల్లో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిసా- పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఉన్న ఆవర్తనం ప్రభావం వల్ల ఒడిసా- పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని వెల్లడించింది.
ఎక్కడ చూసినా వర్షాలే..!
ఇదిలా ఉంటే.. కామారెడ్డి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డితో పాటు తాడ్వాయి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, బిక్కనూర్, సదాశివనగర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు.. కొమరం భీం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షంతో శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, ఆర్కేపీ, ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది.