హై సెక్యూరిటీ నడుము ప్రిగోజిన్ అంత్యక్రియలు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రష్యాపై ఇటీవల తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్గనీ ప్రిగోజిన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పొర్ఖొవ్ స్కయా శ్మశానవాటిక లో హై సెక్యూరిటీ నడుమ ప్రిగోజిన్ అంత్యక్రియలను మంగళవారం నిర్వహించినట్లు రష్యా మీడియా తెలిపింది. అయితే, ఒకప్పటి తన అంతరంగికుడి అంతిమ సంస్కారాలకు అధ్యక్షుడు పుతిన్ హాజరుకాలేదు. ప్రిగోజిన్ అంత్యక్రియలకు హాజరయ్యే ఉద్దేశం పుతిన్ కు లేదని క్రెమ్లిన్ వర్గాలు స్పష్టం చేశాయి.ఇటీవలే జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మృతి చెందిన విషయం తెలిసిందే. మాస్కో నుంచి సెయింట్ పీట్స్బర్గ్కు ప్రైవేటు విమానంలో వెళ్తుండగా.. మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్ రీజియన్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రిగోజిన్ సహా మొత్తం 10 మంది మరణించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియలేదు. కానీ, వాగ్నర్ చీఫ్ మరణం వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హస్తం ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రిగోజిన్ అంత్యక్రియలను చివరి వరకూ రహస్యంగా ఉంచడం గమనార్హం.