కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం .. రూ 10 లక్షల ఆస్తి నష్టం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: హైదరాబాద్‌లో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. నగరంలో తరచూ ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా సిటీలో మరో అగ్నిప్రమాదం జరిగింది. కూకట్‌పల్లిలోని ఓ సర్వీసింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి.హైదర్‌నగర్‌లోని జెమ్ మోటార్స్ సర్వీసింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెయింటింగ్ కోసం ఉపయోగించే కంప్రెషర్ ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటలు సర్వీసింగ్ సెంటర్ మొత్తానికి వ్యాపించడంతో దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేశాయి . దీంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.అయితే ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై సిబ్బంది, స్థానికులను పోలీసులు ఆరా తీస్తున్నారు. కంప్రెషర్ పేలడంతోనే మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఈ అగ్నిప్రమాదంతో సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.