కార్గిల్ వీరుడిగా దేశం కోసం పోరాడాను..కానీ భార్యను కాపాడుకోలేకపోయాను’
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ‘కార్గిల్ వీరుడిగా దేశం కోసం పోరాడాను. కానీ భార్యను కాపాడుకోలేకపోయాను’ అని మణిపూర్లో నగ్నంగా ఊరేగించిన ఒక మహిళ భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. అస్సాం రెజిమెంట్లో సుబేదార్గా పనిచేసిన మాజీ సైనికుడు, మే 4న జరిగిన అమానుష సంఘటన గురించి మీడియాతో మాట్లాడాడు. తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నాడు. కొందరు వ్యక్తులు జంతువుల మాదిరిగా గుంపుగా వచ్చి తమ వారిపై దాడి చేసినట్లు చెప్పాడు. తమ వర్గాన్ని చంపేందుకు వారు ఆయుధాలతో వచ్చారని, మహిళలను తమ వెంట తీసుకెళ్లి బలవంతంగా బట్టలు విప్పించి నగ్నంగా ఊరేగించారని వాపోయాడు. తమ గ్రామంపై మూక దాడి చేయడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా తలో దారిలో పరుగులు తీసినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో తన భార్య నుంచి తాను వేరైనట్లు చెప్పాడు. మరికొందరితో కలిసి అడవిలో దాక్కున్న తన భార్యను వారు గుర్తించి అమానుషంగా ప్రవర్తించారని వాపోయాడు.కాగా, తాను కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నానని, దేశం కోసం పోరాడానని ఆ మాజీ సైనికుడు తెలిపాడు. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో భాగంగా శ్రీలంకకు కూడా వెళ్లినట్లు చెప్పాడు. ‘నేను దేశాన్ని రక్షించాను.. కానీ నా భార్యను, తోటి గ్రామస్తులను రక్షించలేకపోయాను’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కార్గిల్ యుద్ధాన్ని చూసిన తాను, ఆ తర్వాత ఆర్మీ నుంచి రిటైర్డ్ అయినట్లు తెలిపాడు. అయితే ప్రస్తుతం తన సొంత ఊరు యుద్ధభూమి కంటే ప్రమాదకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయారని విమర్శించాడు. ఇలాంటి అమానుష సంఘటనలు మరిన్ని జరుగవచ్చని ఆందోళన చెందాడు. ఇళ్లను తగులబెట్టి తమవారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆ మాజీ సైనికుడు డిమాండ్ చేశాడు.