హైదరాబాద్ కు 60కి.మీల వరకు రియలేస్టేస్ట్ డమాల్..
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ నగరం తో పాటు నగరం చుట్టూ 60 కిలోమీటర్ల మేరకు రియలేస్టేస్ట్ దందా తిరోగమన దిశలో పయనిస్తుంది. ప్లాట్ల ధరలు నేలచూపులు చూస్తున్నాయి. తాజాగా హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో వచ్చిన స్పందన ఇందుకు నిదర్శనంగా మారింది.హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్లాట్లకు ఈవేలం నిర్వహిస్తే ఇంతకు ముందు హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి. గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో హెచ్ఎండీఏ స్థలాలను విక్రయానికి పెడితే కొనేందుకు హైదరాబాదీలే కాకుండా దేశ, విదేశాలకు చెందినవారు పోటీ పడేవారు. కానీ ఇది 4 నెలల క్రితం వరకు ఉన్న పరిస్థితి! ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రెట్టింపు ధరలు చెల్లించడం మాట అటుంచితే కనీసం కొనుగోలు చేయడానికీ ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో హెచ్ఎండీఏ అధికారులు పునరాలోచనలో పడ్డారు. 111జీవో తొలగింపు నిర్ణయం వల్ల ఇప్పటికే ఐటీ కారిడార్లో ప్లాట్ల కొనుగోళ్లలో మందగమనం సాగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొనుగోళ్ల మందగమనం ఉంటుందని పలువురునిపుణులు చెబుతున్నారు.
లేఅవుట్ల అభివృద్ధితోపాటు ఉన్నత ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పించడంతో హెచ్ఎండీఏ స్థలాల కొనుగోలుకు అందరూ ఆసక్తి చూపారు. హెచ్ఎండీఏ వద్ద కొనే స్థలాలకు ఎలాంటి వివాదాలు లేకుండా క్లియర్ టైటిల్ కావడంతో పెట్టుబడికి భరోసా ఉంటుందని భావించారు. దాంతో ఉప్పల్ భగాయత్, కోకాపేట, బాచుపల్లి, బహదూర్పల్లి, మేడిపల్లి, తుర్కయాంజల్, తొర్రుర్, కుర్మల్గూడతోపాటు బండ్లగూడ, పోచారం అపార్ట్మెంట్లలోని ఫ్ల్లాట్లను కొనుగోలు చేయడానికి చాలా మంది పోటీపడ్డారు. కానీ 4 నెలల నుంచి హెచ్ఎండీఏ ఈవేలం వేసిన బాచుపల్లి గానీ, మేడిపల్లిలోగానీ ప్లాట్లలో ఆశించిన స్థాయిలో ధరలు పలుకలేదు. 6 నెలల్లోనేఈ రెండు ప్రాంతాల్లో పెద్దఎత్తున తేడా వచ్చింది. సగటున చదరపు గజం విలువ సగానికి పడిపోయింది. ఏదీ పరిస్థితి జనగాం,యాదగిరి గుట్ట, భువనగిరి, చౌటుప్పల్, చిట్యాల్ తదితర ప్రాంతాల్లో విక్రయానికి పెట్టిన కొన్ని ప్లాట్లు అమ్ముడుపోలేదు. మూడు రోజుల క్రితం ఈవేలం జరిగిన ఉప్పల్ భగాయత్లో 63 ప్లాట్లను అమ్మకానికి పెడితే 25మాత్రమే అమ్ముడుపోయాయి. మిగతా ప్లాట్లకు కనీసం బిడ్ కూడా దాఖలు కాలేదు. ప్రైవేటు లేఅవుట్లలోనూ క్రయవిక్రయాలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. 2021 డిసెంబరు 2న ఉప్పల్ భగాయత్లో ప్లాట్లను వేలం వేస్తే కొనుగోలుదారులు పోటీపడ్డారు. చదరపు గజం గరిష్ఠంగా రూ.1.01 లక్షలకు కొనేందుకు ముందుకొచ్చారు. కొవిడ్కు ముందు ఉప్పల్ భగాయత్లో చదరపు గజం సగటు ధర రూ.53వేలు ఉండగా ఆ తర్వాత చదరపు గజం సగటున రూ.71వేలుగా నిర్థారణ అయింది. కాగా ఇటీవల హెచ్ఎండీఏ 63 ప్లాట్లను విక్రయానికి పెట్టింది. చదరపు గజం అత్యధికంగా లక్ష దాటుతుందని భావిస్తే కేవలం రూ.53,500కు ఖరారైంది. ఉప్పల్ భగాయత్లో అమ్ముడుపోయిన 25 ప్లాట్లతో చదరపు గజం సగటు ధర కేవలం రూ.38వేలుగా నిర్ణయమైంది. ఇక 111జీఓను ఎత్తివేయాలన్న నిర్ణయం తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొంత స్తబ్ధత ఏర్పడింది. యాదగిరి గుట్ట బీబీనగర్, జనగాం ప్రాంతాల్లో ప్రకటించిన దరకంటే సగం వచ్చినా తీసివేయల్నిరియల్టర్లు ముందుకు వస్తున్నారు, ఐనా కొనే వారు లేకపోవడం తో బెంబేలెత్తి పోతున్నారు. ఐటీ కారిడార్లోని కోకాపేట, పుప్పాలగూడ, నానక్రాంగూడ, నార్సింగి తదితర ప్రాంతాల్లో చదరపు గజానికి లక్షల్లో పెట్టి కొనుగోలు చేస్తే ఆ స్థాయిలో విక్రయించేందుకు మున్ముందు అవకాశాలపై ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో ఆరు నెల్లల్లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం పై రియల్టర్లు గంపెడు ఆశలు పెట్టుకొని చూస్తున్నారు.