సిటీలో మ్యాన్ హోల్స్ తెరిస్తే జైలుకే
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: నగరంలో చిన్న వర్షం కురిసినా.. రోడ్లన్నీ జలమయమైపోతాయి. రహదారులపై భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో కొందరు అనధికారికంగా మ్యాన్ హోళ్లను తెరుస్తారు. అందులో కొట్టుకుపోయి చనిపోయిన ఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.నగరంలోని రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్హోళ్లను ఎవరైనా తెరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు అలా తెరిచిన వారిని జైలుకు పంపుతామని జలమండలి అధికారులు హెచ్చరించింది. జలమండలి చట్టం 1989 సెక్షన్ 74 ప్రకారం అక్రమంగా మ్యాన్హోళ్లు తెరిస్తే క్రిమినల్ కేసులు పెట్టే అధికారం ఉందని చెప్పారు. సీవరేజ్ సమస్యలు ఉంటే జలమండలి వినియోగదారుల సేవా కేంద్రం 155313కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. వర్షాకాలంలో ఎప్పటికప్పుడు మ్యాన్హోళ్లను శుభ్రం చేసేందుకు ఎయిర్టెక్ యంత్రాలను సిద్ధం చేశామని వెల్లడించారు.ఇక గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న లోతైన మ్యాన్హోళ్లను ప్రజలు గుర్తించేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అవి అత్యంత ప్రమాదకరమని చెప్పేలా వాటికి ఎరుపు రంగును వేస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 25 వేలకు పైగా లోతైన మ్యాన్హోళ్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిపై సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయడమే కాకుండా.. వాటికి రెడ్ కలర్ పూస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో మ్యాన్హోళ్లలో ఎవరూ పడిపోకుండా పడకుండా జాగ్రత్తలతో జిహెచ్ఎంసి ప్రజలను అప్రమత్తం చేస్తుంది.